అపార్ట్మెంట్ పైనుంచి పడి బాలుడి మృతి
దుబాయ్: భారత సంతతికి చెందిన ఏడేళ్ల బాలుడు అపార్ట్ మెంట్ 13వ అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సోమవారం చోటు చేసుకుంది. షార్జాలోని ఏ1 షెవియన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ 13వ అంతస్తులో ఆడుకుంటున్న ఆ బాలుడు ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి పడి మృతి చెందినట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.
బాలుడి మృతి పట్ల పోలీసులు అతడి తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ప్రత్యక్షసాక్షులను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని షార్జాలోని ఏ1 కువైటి ఆస్పత్రిలోని ఫోరెన్సిక్ లాబోరేటరీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడి మీడియా కథనం ప్రకారం... పిల్లల పట్ల నిర్లక్ష్య వ్యవహరించే తల్లిదండ్రులకు ఈ ఘటన నేపథ్యంలో మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వారిని చూసుకునేందుకు ఆయాలను నియమించుకోవాలని సూచించారు.
తల్లిదండ్రుల సరైన పర్యవేక్షణ లేని కారణంగా ఇలాంటి ఘటనలు యుఏఈలో పెరిగిపోతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.