'సమైక్య' ప్రాంతీయ వాదం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టనప్పుడు, తాము విడిపోవడానికే సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజలు చెబుతునప్పుడు సీమాంధ్ర నాయకులు, వారికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు సంకుచితంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. ఆ రకంగా ప్రస్తుతం వారు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతీయ వాదానికి మాత్రమే పరిమితయ్యారు. ఆ రకంగా సమైక్యవాదం అర్థమే మారిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో సమైక్యవాదం సంకుచిత ఆలోచనగా మారిపోయింది. చంద్రబాబు, వైయస్ జగన్, చిరంజీవి కూడా సంకుచిత ఆలోచనా ధోరణికి పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ సంకుచిత ధోరణి వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే మనకు నీళ్లు రావంటూ, మరో విధంగా ఆయన రాయలసీమ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారు. రాష్ట్రానికి అంతటికీ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ప్రాంతీయ నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకున్నారు. ప్రాంతీయవాదం వచ్చేటప్పటికి చంద్రబాబు, వైయస్ జగన్, చిరంజీవి, వైయస్ రాజశేఖర రెడ్డి అంతా ఒక్కటేనని బహిర్గతమైంది. తెలంగాణ ప్రజలను వారు ఏ విధంగా చూస్తున్నారనేది కూడా తేటతెల్లమైంది.
కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, విద్యార్థులు చేస్తున్న సమైక్యవాదంలో కలిసి ఉందామనే విజ్ఞాపన తెలంగాణ ప్రజలకు చేసే స్థితిలో కూడా లేరు. తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కరలేదు, తమవే విశాల భావాలనే పద్ధతిలో తమ సంకుచిత వైఖరిని బయట పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, కలిసి ఉండడానికి వారిని ఒప్పించడానికి తగిన ప్రాతిపదిక ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా వారు చేయడం లేదు. అంటే, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదు, వారి అభిప్రాయాలకు విలువ లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం ఆధిపత్య ధోరణే అవుతుంది. లగడపాటి రాజగోపాల్ 23 జిల్లాల్లో సమైక్యవాదం ఉంటుందని చెబుతున్నారే గాని అదెలా ఉందో నిరూపించడం లేదు. మనమంతా కలిసి ఉందామని కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు కనీసం విజ్ఞప్తి చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాలని తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన ప్రాతిపదికను వివరిస్తూ తెలంగాణేతర ప్రాంతాలవారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆ సామరస్య ధోరణిని తెలంగాణేతర నాయకులు ప్రయత్నించడం లేదు. తెలంగాణవారు కూడా తమతో సమానమనే మానవ స్వభావం కూడా వారిలో కొరవడింది. ఇది సంకుచిత భావనే అని అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రాంతీయ వాదం విశాల భావనగానూ సమైక్యవాదం ప్రాంతీయ వాదంగానూ స్థిరపడే పరిస్థితి వచ్చింది. సమైక్యవాదం సంకుచిత భావనగా రూపుదిద్దుకుంటోంది. సమైక్యవాదుల వైఖరి వల్ల తెలుగు పదాలకు అర్థం మారే పరిస్థితి వచ్చింది.