Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'సమైక్య' ప్రాంతీయ వాదం

Telugu Talli
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రకటన చేసిన మర్నాటి నుంచి రాజకీయ రాష్ట్ర నాయకుల అసలు రంగు బయటపడింది. కొంపలు మునిగినట్లు గగ్గోలు పెడుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కటై సమైక్యనినాదం వినిపిస్తున్నారు. విద్యార్థులను ప్రేరేపించి కృత్రిమ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం నాయకులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒక్క రోజు కూడా నిరాహార దీక్ష చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం వారి నిరాహార దీక్షలను, ఆందోళనలను అపడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. లగడపాటి రాజగోపాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కూడా ఒక డ్రామాలా కొనసాగనిచ్చారు. ఈ స్థితిలో ఏది ప్రాంతీయవాదం, ఏది సమైక్యవాదం, ఈ రెండింటిలో ఏది సంకుచిత వాదం అని ఆలోచించాల్సి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల అభిప్రాయం అభిప్రాయం కానట్లుగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆకాంక్ష కానట్లుగా సీమాంధ్ర నాయకులు ప్రవర్తించడం, మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు. అలాగే, రాష్ట్ర నాయకులమని చెప్పుకునే చంద్రబాబు, చిరంజీవి, వైయస్ జగన్ తెలంగాణ ప్రజలను పక్కన పెట్టి సీమాంధ్ర రాజకీయ నాయకుల గొంతునే వినిపిస్తున్నారు. మూడు ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం వారికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రయోజనాలకు, ముఖ్యంగా అక్కడి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనేది ప్రస్తుత వైఖరిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టనప్పుడు, తాము విడిపోవడానికే సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజలు చెబుతునప్పుడు సీమాంధ్ర నాయకులు, వారికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు సంకుచితంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. ఆ రకంగా ప్రస్తుతం వారు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతీయ వాదానికి మాత్రమే పరిమితయ్యారు. ఆ రకంగా సమైక్యవాదం అర్థమే మారిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో సమైక్యవాదం సంకుచిత ఆలోచనగా మారిపోయింది. చంద్రబాబు, వైయస్ జగన్, చిరంజీవి కూడా సంకుచిత ఆలోచనా ధోరణికి పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ సంకుచిత ధోరణి వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే మనకు నీళ్లు రావంటూ, మరో విధంగా ఆయన రాయలసీమ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారు. రాష్ట్రానికి అంతటికీ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ప్రాంతీయ నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకున్నారు. ప్రాంతీయవాదం వచ్చేటప్పటికి చంద్రబాబు, వైయస్ జగన్, చిరంజీవి, వైయస్ రాజశేఖర రెడ్డి అంతా ఒక్కటేనని బహిర్గతమైంది. తెలంగాణ ప్రజలను వారు ఏ విధంగా చూస్తున్నారనేది కూడా తేటతెల్లమైంది.

కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, విద్యార్థులు చేస్తున్న సమైక్యవాదంలో కలిసి ఉందామనే విజ్ఞాపన తెలంగాణ ప్రజలకు చేసే స్థితిలో కూడా లేరు. తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కరలేదు, తమవే విశాల భావాలనే పద్ధతిలో తమ సంకుచిత వైఖరిని బయట పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, కలిసి ఉండడానికి వారిని ఒప్పించడానికి తగిన ప్రాతిపదిక ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా వారు చేయడం లేదు. అంటే, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదు, వారి అభిప్రాయాలకు విలువ లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం ఆధిపత్య ధోరణే అవుతుంది. లగడపాటి రాజగోపాల్ 23 జిల్లాల్లో సమైక్యవాదం ఉంటుందని చెబుతున్నారే గాని అదెలా ఉందో నిరూపించడం లేదు. మనమంతా కలిసి ఉందామని కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు కనీసం విజ్ఞప్తి చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాలని తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన ప్రాతిపదికను వివరిస్తూ తెలంగాణేతర ప్రాంతాలవారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆ సామరస్య ధోరణిని తెలంగాణేతర నాయకులు ప్రయత్నించడం లేదు. తెలంగాణవారు కూడా తమతో సమానమనే మానవ స్వభావం కూడా వారిలో కొరవడింది. ఇది సంకుచిత భావనే అని అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రాంతీయ వాదం విశాల భావనగానూ సమైక్యవాదం ప్రాంతీయ వాదంగానూ స్థిరపడే పరిస్థితి వచ్చింది. సమైక్యవాదం సంకుచిత భావనగా రూపుదిద్దుకుంటోంది. సమైక్యవాదుల వైఖరి వల్ల తెలుగు పదాలకు అర్థం మారే పరిస్థితి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+