పెట్టుబడులపై సర్వే: జపాన్ను దాటేసి ఐదో స్థానానికి భారత్, ఈ రంగాల్లో కొత్త ఉద్యోగాలు
దావోస్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక శక్తుల్లో భారత్ ఐదో స్థానాన్ని దక్కించుకుందని గ్లోబల్ కన్సల్టెన్సీ ప్యూసీ(పీడబ్ల్యూసీ) తన సీఈఓల సర్వేలో తేల్చింది. దావోస్లో కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నా ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు వెల్లడించారు.
'ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది' అని పీడబ్ల్యూసీ తన 21వ సీఈఓ సర్వేలో పేర్కొంది. 46శాతం పెట్టుబడుల ఆకర్షణతో ప్రపంచంలో ముందంజలో ఉంది.
ఆ తర్వాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో చైనా(33శాతం), జర్మనీ(20శాతం) ఉండగా, నాలుగో స్థానంలో యూకే(15శాతం) ఉంది. 9శాతంతో భారత్.. జపాన్(8శాతం)ను దాటేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 2018లో ఈ ఐదు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను అమితంగా ఆకర్షించనున్నట్లు సర్వే తెలిపింది.
54శాతం మంది సీఈఓలు తమ సంస్థను విస్తృతం చేయాలని చూస్తుండగా.. 18శాతం మంది మాత్రం తమ సిబ్బందిలో కోతను పెట్టాలని చూస్తున్నారు. హెల్త్ కేర్(71శాతం), టెక్నాలజీ(70శాతం), బిజినెస్ సర్వీసెస్(67శాతం), కమ్యూనికేషన్స్(60శాతం) హాస్పిటాలిటీ, లీజర్(56శాతం) రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయని సర్వే తేల్చింది.