జగన్ పార్టీ కోవర్టుగా కిరణ్ కుమార్ రెడ్డి?
కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పటికైనా కట్టడి చేయాలని, లేదంటే రాష్ట్రంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్కు చెప్పారు. వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, సిరిసిల్ల రాజయ్యల బృందం మంగళవారం ఆజాద్ను ఆయన కార్యాలయంలో కలిసింది. ఇటీవలి రాష్ట్ర పరిణామాలను అరగంటకు పైగా ఆయనకు వివరించారు.
వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యే విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటనకు ప్రభుత్వం చేసిన భారీ ఏర్పాట్లను చూస్తే.. జగన్కు కోవర్టు కిరణేననేది తేటతెల్లమవుతోందని వెల్లడించారు. చెప్పడంతో సరిపెట్టక, సిరిసిల్ల పర్యటన జరిగిన తీరును వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఆజాద్కు చూపించారు. ముఖ్యమంత్రే దీనంతటికీ బాధ్యత వహించాలని అనంతరం వివేక్ మీడియాకు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో పోలీసు జులుం నడుస్తోందన్నారు. సీఎం తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. కేంద్రంలో తెలంగాణకు అనుకూలంగా ఆలోచించే సమయంలో.." తెలంగాణ ఇస్తే దేశం మొత్తం సమస్య అవుతుంద''ని సీఎం వ్యాఖ్యానించారని ఆరోపించారు.
విజయలక్ష్మి పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయన ప్రయత్నించారన్నారు. ఆజాద్కు ఈ విషయాలన్నీ వివరించగా, "ఇంతమంది పోలీసులున్నారా!. సమన్వయ కమిటీ సమావేశంలో ఆరా తీస్తా'' అని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వారే పార్టీని పతనం చేయాలని చూస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 'సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రైల్ రోకో చేస్తామని ముందుగానే మీకు చెప్పి వెళ్లాం. కానీ అ క్కడికి వెళ్లాక పోలీసులు అ రెస్ట్ చేశారు. ఇప్పుడేమో విజయలక్ష్మికి ఇంత భద్రత ఇచ్చారు. చూడండి' అని ఆజాద్కు వివరించాం'' అని అన్నారు.
వేలాది మంది పోలీసులను రక్షణగా ఇచ్చి సీమాంధ్ర నాయకులు తెలంగాణలో పర్యటించేందుకు ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి, చర్యలు తీసుకుంటామని ఆజాద్ తమకు హామీ ఇచ్చారని సుఖేందర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని, పేపర్, టీవీల్లో వచ్చిన కథనాలను సేకరిస్తోందని మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కిరణ్ హయాంలో జగన్ పార్టీ బలోపేతం అవుతోందని చెప్పారు. జైల్లో జగన్కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, మాట్లాడుకునేందుకు శాటిలైట్ ఫోన్ కూడా ఇస్తున్నారని ఆరోపించారు.
డిజిపి దినేష్ రెడ్డి జగన్ బంధువులతో బంధుత్వం ఉందని తెలిపారు. గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు చేయని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా విజయమ్మ సిరిసిల్ల ధర్నా విషయంలో ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయమ్మ కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి భద్రత కల్పించడంపై ఆయన మండిపడ్డారు.