క్రైసిస్ మేనేజ్మెంట్: ధర్మాన రాజీనామా పెండింగ్
ధర్మాన రాజీనామాను ఆమోదిస్తే సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మరో నలుగురు మంత్రుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిల చేత కూడా రాజీనామాలు చేయించాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. అలాగే, కోర్టులో దోషిగా తేలిన మంత్రి పార్థసారథి భవిష్యత్తుపై కూడా దాని ప్రభావం పడుతుంది. దీంతో మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనే సంక్షోభం తలెత్తుతుంది. అది ప్రభుత్వ మనుగడను కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనివల్లనే అధిష్టానం ధర్మాన రాజీనామా విషయాన్ని ఆయనకే వదిలేసినట్లు తెలుస్తోంది.
ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై అధిష్టానం జోక్యం చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డిని ఈ స్థితిలో అసంతృప్తికి గురి చేయాలని అనుకోవడం లేదని అంటున్నారు. పరిస్థితి తమ చేతుల మీదుగా తాము విషమింపజేసుకునే బదులు చట్టం తన పద్ధతిలో తాను వ్యవహరించుకుంటూ పోతే సంభవించే పరిణామాలను ఆహ్వానించడమే మేలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ధర్మాన ప్రసాద రావును ఏదో నిందితుడిగా చేర్చింది. దీంతో ధర్మాన ప్రసాద రావు నైతిక బాధ్యత వహించి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు. అయితే, ఆ రాజీనామా లేఖను కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్కు పంపించకుండా పెండింగులో పెట్టారు. ధర్మాన ప్రసాద రావు మాత్రం అధికార కార్యకలాపాలకు హాజరు కావడం లేదు. కానీ శుక్రవారం నుంచి పరిస్థితి మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ధర్మాన ప్రసాద రావు రాజీనామాను అంగీకరించవద్దని పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. కిల్లి కృపారాణి వంటి నాయకులు ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించకుండా చూడాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద వేడుకున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను అంగీకరిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని గుర్తించిన అధిష్టానం దానిపై ఒత్తిడి చేయడం లేదని చెబుతున్నారు.