కిరణ్ రెడ్డికి 'సహకారం', 'స్థానికం'తో ’14 టార్గెట్
తాజాగా జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలోనూ విజయదుందుభి మోగించడం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠ పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో సమర్థనేతగా అవతరించేందుకు ఒక వేదికగా మారింది. దానికితోడు, చాలా కాలం నుంచి ‘సొంత చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ను గెలిపించలేని ముఖ్యమంత్రి' అన్న ముద్ర పడిన కిరణ్, సొంత జిల్లాలో సత్తా చాటారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడుకు ముందునుంచే కళ్లెం వేశారు. సాంకేతిక అంశాలను అస్త్రంగా సంధించి పెద్దిరెడ్డి వర్గాన్ని దెబ్బతీశారు. లేకపోతే సొంత జిల్లాను గత రెండు ఎన్నికల మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్కు మరోసారి ధారాదత్తం చేయవలసి వచ్చేది.
డీసీసీబీ చైర్మన్గా తన అభ్యర్ధిని గెలిపించిన ఆయన, డీసీఎంఎస్ను పెద్దిరెడ్డి వర్గం-జగన్ పార్టీకి వెళ్లకుండా నిరోధించడంలోనూ విజయం సాధించారు. ఆ పదవిని తెలుగుదేశం పార్టీ సాధించింది. ఎమ్మెల్సీ, తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోరపరా జయం పాలైన నేపథ్యంలో ఈ పరిణామం కిరణ్ రెడ్డికి సొంత జిల్లాలో పట్టు పెరిగిందన్న సంకేతాలు పంపించింది. సహకార ఎన్నికలు ముగిసిన రోజునే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దాంతో ముఖ్యమంత్రి ఆ మూడు నెలలూ తీరిక లేకుండా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతూ జిల్లా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలతోనే కాలం గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. అది జరిగిన తర్వాత మునిసిపల్ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈలోగా నీటి సంఘాల ఎన్నికలు రానున్నాయి. అంటే మరో ఏడెనిమిది నెలల వరకూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరిగే వివిధ ఎన్నికలపైనే సీరియస్గా దృష్టి సారించనున్నారు. ఈ సమయంలో నాయకత్వ మార్పు అసంభవమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కీలకమైన స్థానికల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉండదని, ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరేడు నెలలే సమయం ఉన్నందున ఆ సమయంలో మార్చే ప్రయోగం పార్టీ అధిష్టానం చేయబోదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డికి తాజా పరిణామాలు కలిసి వస్తున్నాయి.