చంద్రబాబు తలకు టిడిపి మాల, మాదిగ విభేదాల బొప్పి
వర్గీకరణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుందని, అది పార్టీ విధానమని చెబుతూ పార్టీ విధాన నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని మాదిగ నాయకులు మాల నాయకులను ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే వారిని పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ లో వారు కొద్దిసేపు ధర్నా చేశారు. ఆ ధర్నాను నాగం జనార్దన్ రెడ్డి విరమింపజేశారు.
కాగా, చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం రాత్రి గానీ మంగళవారం గానీ హైదరాబాద్ రావచ్చు. అప్పుడు మాల, మాదిగల పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరే అవకాశం ఉంది. తెలంగాణ మీది వైఖరి మాదిరిగానే వర్గీకరణ వివాదం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.