సిఎం మార్పుపై పుకార్లు, సోనియతో మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణలోని రెడ్లు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాట పడుతున్నారని ఉప్పందుకున్న కాంగ్రెసు అధిష్టానం దాన్ని కట్టడి చేయాల్సిన అనివార్యతలో పడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. వివాదరహితుడు మాత్రమే కాకుండా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణకు చెందిన రెడ్డి సమాజికవర్గం వలసలను అరికట్టడమే కాకుండా సీమాంధ్ర, ముఖ్యంగా రాయలసీమ రెడ్ల వలసలు కూడా ఆగుతాయని సోనియా గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా లేదనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు కూడా ముందుకు వస్తోంది. అయితే, జగన్ను ఎదుర్కోవడానికి రెడ్ల నాయకత్వమే అవసరమని అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాయలసీమలో రెడ్ల ప్రాధాన్యం తగ్గలేదని చెప్పడానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. రాయలసీమలో జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పైగా, వైయస్సార్ కుటుంబానికి, కోట్ల కుటుంబానికి మధ్య మొదటి నుంచి రాజకీయ వైరుధ్యాలున్నాయి. దీంతో సూర్యప్రకాశ్ రెడ్డి జగన్ ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి తన శక్తియుక్తులను ప్రయోగిస్తారని అంటున్నారు.
తెలంగాణలోని బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలను సంతోషపెడుతూనే రెడ్డి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తే ఫలితం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఈ నెలలో ఎప్పుడైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చునని కూడా ప్రచారం సాగుతోంది. ఈ నెల పదో తేదీ తర్వాత ఎప్పుడైనా ఇది జరగవచ్చునని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం తెలియజేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.