కిరణ్ బెస్ట్, తెలంగాణ వస్తే గీతా: సర్వే, నిద్రపోనని సిఎం
ఒకవేళ రాష్ట్ర విభజన చేస్తే గీతారెడ్డే తొలి సిఎం అన్నారు. దాని కోసం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద పోరాడుతానన్నారు. కిరణ్, గీతారెడ్డిల చేతుల మీదుగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారాన్ని సర్వే అందుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కిరణ్ను సిఎంగా తొలగించొద్దని సోనియాకు చెప్పానని, కిరణ్ మంచివాడని, మానవతావాది అని, తెలంగాణ బర్నింగ్ అంశం కారణంగా తొలి రోజుల్లో కొన్ని అడ్డంకులు వచ్చాయని, ఆయనను తీసేస్తారనే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్లోనే కొందరు రాజకీయ అవకాశవాదులు కిరణ్ని తీసేస్తే తామే ఆ కుర్చీలో కూర్చోవాలని ప్రయత్నాలు చేశారని కానీ, కిరణ్ను మార్చవద్దని సోనియాకు చెప్పానని, అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ సిఎంలను మారుస్తుందనే అపప్రద వస్తుందని చెప్పానని, 1983లో అదే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన విషయం గుర్తు చేశానని సర్వే చెప్పారు. తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నందునే, దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిందని, లేదంటే గీతారెడ్డికి అవకాశం వచ్చేదన్నారు.
మాటిస్తే... కిరణ్
ఎన్నికల కోసం కార్యక్రమాలు చేసే వ్యక్తిని కానని, మాట ఇస్తే అమలు చేసేంత వరకు నిద్రపోనని, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో కార్యక్రమాలను అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దళిత, గిరిజనుల ఉప ప్రణాళికకు అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించామని ఆయన గుర్తు చేశారు. ఈశ్వరీబాయి ప్రతిపక్ష నేతగా డైనమిక్గా ఉండేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆమె కూతురు గీతారెడ్డి దీనికి భిన్నమని, ఎమ్మెల్యే కాగానే మంత్రి అయ్యారని, గీతారెడ్డి గెలిసినప్పుడల్లా కేబినెట్లో చోటు దక్కిందన్నారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అందుకే ఆమె ఇప్పటివరకు ప్రతిపక్షంలో లేరు. ఇకపైనా ఆమె ప్రతిపక్షంలో ఉండొద్దు, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కదా అని చమత్కరించారు. తనకూ, గీతారెడ్డికీ రాజకీయ వారసత్వం ఉంది గానీ, కేంద్ర మంత్రులు బలరాం నాయక్, సర్వేలు ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండానే ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన అభినందించారు.