రాజధానుల అంశం పై నేడే సుప్రీంకోర్టులో విచారణ - చివరి నిమిషంలో..!!
ఏపీలో రాజధాని వ్యవహారానికి సంబంధించిన కేసులు నేడు సుప్రీంలో విచారణకు రానున్నాయి. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నెల ఒకటవ తేదీన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో గతంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల్లో న్యాయవాదిగా 2014లో ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ సలహా ఇచ్చిన అంశాన్ని అమరావతి రైతుల తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో, వెంటనే ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని.. మరో ధర్మాసనంకు ఈ కేసు రిఫర్ చేయాలని సీజేఐ సూచించారు.
అమరావతి కేసులను ఒకే ధర్మాసనం ముందు లిస్టు చేయాలని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ కేసుల జాబితాలో రిజిస్ట్రీ చేర్చింది. రాజధాని అమరావతికి సంబంధించిన కేసులతో పాటుగా.. 2013, 14ల్లో రాష్ట్ర విభజనను, రాష్ట్ర విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు, విభజన చట్టం హామీలు అమలుపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి వేసిన పిటిషన్లతో ఈ అమరావతి పిటిషన్లను జత చేసారు. వాస్తవానికి అమరావతి కేసులను ఈ నెల 14వ తేదీకి లిస్టు చేసినట్లు గురువారం సాయంత్రం వరకు కంప్యూటర్ జనరేటెడ్ లిస్టు చూపింది. తర్వాత అది ఈ రోజుకు మారింది.
గురువారం రాత్రి విడుదలైన ఈ రోజుకు సంబంధంచిన సప్లిమెంటరీ కాజ్ లిస్టులో ఈ కేసులను కోర్టు నంబర్ 5, ఐటమ్ నంబర్ 47 కింద లిస్టు చేసారు. రాష్ట్ర విభజన అంశాలు - రాజధాని పిటీషన్లు కలిసి మొత్తం 36 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రెండు అంశాలను జత చేయటం కొత్త అంశం. రాష్ట్ర విభజన పిటిషన్ల నుంచి రాజధాని పిటిషన్లను వేరు చేయాలని అమరావతి రైతులు, రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ ఇచ్చిన తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్ఫీ దాఖలు చేయగా, తమ వాదనలు వినాలంటూ అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేసారు. అటు ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ చేయాలని సుప్రీం కోర్టుకు లేఖ రాసింది.