ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు: తుని ఘటనలో ప్రధాన నిందితులు వీరే
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆచితూచి అడుగులేసిన సీఐడీ ఎట్టకేలకు మంగళవారం మీడియాకు వివరాలను వెల్లడించింది. తుని ఘటనకు సంబంధించిన అరెస్ట్ చేసిన నిందితులను సీఐడీ పోలీసులు ఈరోజు కాకినాడ కోర్టుకు తరలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వీరిలో దూడల ఫణీంద్ర(అమలాపురం), కూరాకుల దొరబాబు(పిఠాపురం), మహేష్(గుంటూరు), పవన్కుమార్(గుంటూరు), నక్కా సాయి(తూర్పుగోదావరి) ఉన్నారు.
దూడల ఫణీంద్ర అమలాపురంలో రౌడీషీటర్ అని పోలీసులు తేల్చారు. 2015లో అమలాపురంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితుడని స్పష్టం చేశారు. 2012లో జరిగిన హత్య కేసులో, 2009లో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో దొరబాబు నిందితుడని వెల్లడించింది.
గుంటూరుకు చెందిన లక్కింశెట్టి శివ, పవన్కుమార్ తుని ఘటనాస్థలంలో విలేకరి సెల్ఫోన్ లాక్కున్నారన్నారని పోలీసులు స్పష్టం చేశారు. వీరి నుంచి సెల్ఫోన్ను రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. పైన పేర్కొన్న వారందరికి తుని ఘటనలో ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు.
ఫొటోలతో సహా సాక్ష్యాధారాలను సేకరించామని సీఐడీ స్పష్టం చేసింది. కాగా తునిలో జరిగిన రైలు దహనం, ఆ తర్వాత రైల్వే స్టేషన్లో విధ్వంసం వెనుక సూత్రధారులుగా భావిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని హోం మంత్రి చినరాజప్ప మంగళవారం ప్రకటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు అమాయకులు కాదని, రౌడీషీటర్లని ఆయన తెలిపారు.
వీరందరినీ ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నామని, రైలు దహనం వెనకున్న అసలు నేరస్తులను బయటపెట్టడమే తమ ఉద్దేశమని వివరించారు. అమలాపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, కాపు సోదరులు సంయమనం పాటించాలని ఆయన పేర్కొన్నారు.
తుని ఘటనలో నిందితులు వీరే:
*
దూడల
మహేంద్ర(అమలాపురం)
*
కూరాకుల
దొరబాబు(పిఠాపురం)
*
మహేష్(గుంటూరు)
*
లక్కింశెట్టి
శివ
(గుంటూరు)
*
పవన్కుమార్(గుంటూరు)
*
నక్కా
సాయి(తూర్పుగోదావరి)
తుని ఘటనలో మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసులో మంగళవారం ఉదయం సీఐడీ పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. తుని సంఘటనలో వందలాది నిందితులను గుర్తించిన సీఐడీ పోలీసులు సోమవారం ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.