మాన్సాస్ తీర్పుపై అప్పీలుకు ఏపీ సర్కార్- మంత్రి వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్ధానం బోర్డు ఛైర్మన్ పదవుల నియామకం విషయంలో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ ఛైర్మన్గా ఉన్న సంచైతా గజపతిరాజు నియామకం చెల్లదని, తిరిగి గత ఛైర్మన్ అశోక్ గజపతిరాజును నియమించాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామని దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదని, ఓసారి చూసిన తర్వాత అప్పీలుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మాన్సాస్, సింహాచలం ఆలయాల ఛైర్మన్ల నియామకంలో తామెక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. కోర్టు తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా, ఒక్కోసారి వ్యతిరేకంగా వస్తాయన్నారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్, సింహాచలం ట్రస్టులకు కుటుంబ వారసత్వ ఛైర్మన్గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించింది. అశోక్ స్ధానంలో ఆయన అన్న కూతురు, బీజేపీ నేత సంచైత గజపతిరాజును తెరపైకి తెచ్చింది. విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా ఆమెను అర్ధరాత్రి జీవోలతో హడావిడిగా ఈ రెండు బోర్డుల ఛైర్మన్గా నియమించడంతో పాటు వైసీపీ నేతలు దగ్గరుండి ప్రమాణస్వీకారం కూడా చేయించారు. దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.