జగన్ సిలబస్ లోకి విపక్షాలు-ఇక సై అంటే సై- ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం
ఏపీలో కొత్త ఏడాదిలో విపక్షాలు తమ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నాయి. ఇప్పటివరకూ జరిగింది వదిలిపెట్టి జరగాల్సిన దానిపై సీరియస్ గా దృష్టిసారిస్తున్నాయి. వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోవడం, మరో ఏడాదిన్నర తర్వాత ఎలాగో ఎన్నికల వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్న విపక్షాలు.. ఆ మేరకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. అన్నింటికీ మించి జగన్ బాటలోనే, ఆయన సిలబస్ తో ముందుకెళ్తే తప్ప ఆయన్ను ఢీకొట్ట లేమన్న నిశ్చితాభిప్రాయానికి విపక్షాలు వచ్చేస్తున్నాయి.
రెండున్నరేళ్ల వైసీపీ పాలన
ఏపీలో రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. అంతకుముంచి ప్రత్యర్ధుల్ని లక్ష్యంగా చేసుకుంటుందన్న అపప్రదనూ మూటగట్టుకుంది.అయినా ఎక్కడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజా వేదిక కూల్చివేత ద్వారా విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ సర్కార్.. ఇప్పటికీ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దాడులతోనే విపక్షాలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ప్రత్యర్ధుల్ని బెంబేలెత్తిస్తోంది. అదే ఇప్పుడు వైసీపీకి బలంగా విపక్షాలకు బలహీనతగా మారిపోయింది.
దాడులు, కేసులతో విపక్షం బెంబేలు
ఈ రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం విపక్షాలను కట్టడి చేసేందుకు ఓవైపు దాడుల్ని, మరోవైపు కేసుల్ని ఆయుధాలుగా వాడుకుంటోంది. నోరెత్తితే దాడులు, లేకపోతే కేసులు.. ఇలా ప్రత్యర్దుల్ని తన దారికి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ దాడులు, కేసులతో విపక్షంలోని పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వచ్చేశారు. మిగతా వారిలో చాలా మంది వైసీపీ దారిలోకి వచ్చేశారు. దీంతో విపక్షం భవిష్యత్ పోరాటాల విషయంలో లెక్కలు మార్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చేసింది.
జగన్ సిలబస్ పై విపక్షాల దృష్టి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరిగిన దాడులు, కేసులతో విపక్షం బెంబేలెత్తుతోంది. జగన్ రాజకీయాల సిలబస్ ను మార్చేస్తున్న వైనాన్ని విపక్షం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. దీంతో తాము కూడా అదే బాటలో వెళ్తే తప్ప జగన్ ను ఎదుర్కోవడం సాధ్యం కాదని విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ భావిస్తున్నాయి. అందుకే జగన్ సిలబస్ ను తామూ అనుసరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రధాన విపక్షమైన టీడీపీ జగన్ బాటలోనే వెళ్లి పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు అలా పోరాడగల నేతలకే భవిష్యత్తు ఉంటుందని కుండబద్దలు కొట్టేస్తున్నారు. అటు బీజేపీ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
Recommended Video
ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం ?
ఏపీ రాజకీయాల్లో జగన్ రాకతో సిలబస్ పూర్తిగా మారిపోయింది. ఈ సిలబస్ కు అలవాటు పడితే తప్ప ఈ రాజకీయ చదరంగంలో నెగ్గడం కష్టమేనని విపక్షం భావిస్తోంది. అందుకే దాడులకు దాడులతో సమాధానం చెప్పడం, వీలైనంత వరకూ అధికార పక్షాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం, ఎక్కడైనా నోరు జారితే పట్టుకుని రాజకీయం చేయడం, కొత్త కొత్త వివాదాల్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, అనుకూల మీడియాతో దాన్ని పదే పదే ప్రచారం చేయించడం ఇప్పుడు విపక్షాల సిలబస్ లోకి చేరిపోతున్నాయి. అలా జగన్ బాటలో వెళ్లి జగన్ ను ఢీకొట్టేందుకు విపక్షం ఈ కొత్త ఏడాదిలో సర్వశక్తులొడ్డే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.