బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి, సంచలన సంస్కరణలు!
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాప్యం జరగ్గకుండా ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనవసరపు చట్టాలను, నిబంధనలను తొలగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డి-రెగ్యులేషన్ ఫేజ్-2 కార్యక్రమంపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చింది. ఈ బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచడం... అనుమతుల సులభతరం చేయడం... అనవసరపు నిబంధనల సడలింపుపై చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను... రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, కేంద్రం సూచించిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఫేజ్-1 ఎంత వరకు అమలు చేశారని... ఫేజ్-2లో ప్రస్తుత స్థితి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డి-రెగ్యులేషన్ ఫేజ్-1లో మొత్తం 7 శాఖల్లో 23 ప్రాధాన్యత అంశాలను పూర్తి చేశామని, ఇక ఫేజ్-2లో 28 ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తం 47 సిఫార్సుల్లో ఇప్పటివరకు 18 అమలు కాగా, మే 31 నాటికి పూర్తి లక్ష్యం చేరుకుంటామన్నారు.

సులభంగా అనుమతుల ప్రక్రియ
పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియలో ఉన్న క్లిష్టతను తగ్గించి, వేగం పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలు తొలగింపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనలను 100లోపు తీసుకురావాలని, అనుమతులకు లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనవసర వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డబుల్ లైసెన్సింగ్ వంటి వాటిని పూర్తిగా తొలగించాలని సూచించారు.
ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారాలకు జీవితకాల చెల్లుబాటు ఉండేలా... వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఇక ఫైర్ సేఫ్టీ అంశంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన, సరళమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు నుంచి అనుమతి వరకూ మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేయాలని, ఫేజ్-2 అమలు అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సమయం కనీసం 40 శాతం వరకు తగ్గేలా కార్యాచరణను రూపొందించాలని పేర్కొన్నారు.
ఒకే శాఖలోని అన్ని అనుమతుల విలీనం
డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలుకు అవసరమైన ఆర్డినెన్సులు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలు, వ్యాపారాల కోసం ప్రస్తుతం 82 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉందని... ఆ సంఖ్యను దశలవారీగా 57 వరకు తగ్గించాలని సీఎం సూచించారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వంటి కీలక అనుమతులు 30 వరకు ఉన్న ప్రక్రియలను 18కు తగ్గించేలా చూడాలన్నారు. ఒకే శాఖలో ఉన్న అనుమతులను విలీనం చేయడం, పర్మిషన్లు కాకుండా... ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే విధానం వంటి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూ వినియోగానికి సంబంధించిన క్లిష్టతను తగ్గించేందుకు భూ వినియోగ మార్పు అవసరాన్ని తొలగించడం, నాలా చట్టాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకోగా, భవిష్యత్తులో డిమాండ్ ఆధారిత జోనింగ్ విధానాన్ని అమలు చేసేలా లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల పార్కులు, క్లస్టర్లలో భూమి వినియోగాన్ని మరింత సులభతరం చేసి, పెట్టుబడిదారులకు వేగంగా భూమి కేటాయించే విధానాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. ఒకే నోడల్ ఏజెన్సీ ద్వారా అన్ని అనుమతులను ఇవ్వాలనే దిశగా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఫైర్ సేఫ్టీ, పర్యావరణం, విద్యుత్, పర్యాటకం, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా అనుమతుల సరళీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించే అవకాశం
నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన సులభమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలను తీసుకురావడం, పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం, విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన అందించడం వంటి చర్యలు అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పించడం, నిర్దిష్ట కాలానికి తనిఖీలు తగ్గించడం వంటి సంస్కరణలతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించే దిశగా పని చేయాలని సీఎం సూచించారు.
ఇక అనుమతులకు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయడం కూడా కీలక అంశమేనని సీఎం చెప్పారు. దరఖాస్తు నుంచి అనుమతి వరకూ అన్ని సేవలను ఆన్లైన్లోకి తీసుకువస్తే దరఖాస్తుదారులకు చాలా వరకు పని భారం తగ్గుతుందని... అంతే కాకుండా ట్రాకింగ్, పారదర్శకతను పెంచినట్టు అవుతుందని సీఎం అధికారులకు వివరించారు. మీ సేవా, సింగిల్ డెస్క్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర వంటి వ్యవస్థల ద్వారా ప్రజలకు, వ్యాపారులకు సులభంగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
డి-రెగ్యులేషన్లో కేంద్రం కంటే మెరుగ్గా రాష్ట్రం
డి-రెగ్యులేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన అంశాల కంటే మెరుగ్గా ఏపీ పని చేస్తోందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ సీఎం చంద్రబాబుతో అన్నారు. నిర్ధిష్ట గడువులోగా ఏపీ ఫేజ్-2ను అమలు చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని పౌండ్రిక్ అభిప్రాయపడ్డారు. నేషన్ ఫస్ట్ నినాదంతో తాము పని చేస్తున్నామని.. ఇలాంటి సంస్కరణల ద్వారా భారత దేశ నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తాము పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి మారామని సీఎం వెల్లడించారు.
అటవీ చట్టాలను వీలైనంత సరళీకరించాలంటూ కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు. డి-రెగ్యులేషన్ ఫేజ్-3ను అమలు చేస్తున్నారా..? అని ముఖ్యమంత్రి స్టీల్ సెక్రటరీని అడిగారు. జూన్ నెల నుంచి ఆ పని మీద ఉంటామని పౌండ్రిక్ తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను ఇప్పటికే తాము వినియోగిస్తున్నామని పౌండ్రిక్కు సీఎం వివరించారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!














Click it and Unblock the Notifications