వైసీపీ - టీఆర్ఎస్ లో ఏకనాధ్ షిండేలు: వారిపై అనుమానాలు : జగన్ - కేసీఆర్ ముందు సాగేనా ..!!
ఏక్నాథ్ షిండే. మహారాష్ట్రలో రెబల్ రాజకీయాలు..ఆ తరువాత సీఎం పీఠం దక్కించుకున్న షిండే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పదే పదే ప్రస్తావనకు వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో.. ఇటు ఏపీ లో జగన్ ప్రభుత్వంలోనూ ఏకనాధ్ షిండే లాంటి అసమ్మతి నేతలు ఉన్నారంటూ వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఏపీలో జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఆ పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటాయంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి నుంచి సీఎం జగన్ కు పదవీ ముప్పు ఉందని జోస్యం చెబుతున్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులపై
అటు తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ సైతం పదే పదే కేసీఆర్ ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ అల్లుడు, కొడుకు, బిడ్డల్లో ఎవరైనా ఏక్నాథ్ షిండేలు కావొచ్చన్నారు. తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో ఏకనాధ్ షిండేలు వస్తారని చెబుతున్నారని..తమతో పెట్టుకుంటే అగ్గేనని హెచ్చరించారు. అయితే, అసలు శివసేనలో చోటు చేసుకున్న పరిణామాలకు వైసీపీ - టీఆర్ఎస్ కు ఏ రకంగా పోలిక సాధ్యమనే చర్చ మొదలైంది. మహారాష్ట్రలో సిద్దాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ సహకరించపోవటంతో శివసేన అప్పటి వరకు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న కాంగ్రెస్ - ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
జగన్ - కేసీఆర్ ను ధిక్కరించే సాహసం చేస్తారా
కానీ, ఏపీ - తెలంగాణల్లో పూర్తిగా జగన్ - కేసీఆర్ ఛరిష్మాతో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఆయన ప్రభుత్వంలో అసమ్మతి బావుటా ఎగరవేసే ధైర్యం చేస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. గత ఏడాది చోటు చేసుకున్న ఈటల రాజేందర్ అంశాన్ని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక, ఏపీ సీఎం జగన్ వైసీపీలో ఒన మ్యాన్ ఆర్మీ. తల్లితో కలిసి పార్టీ ప్రారంభించి.. పాదయాత్రతో తన పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేబినెట్ లో సీనియర్లు ఉన్నా.. వారు జగన్ ఆదేశాలను పాటించాల్సిందే.
ఇద్దరూ ఇద్దరే
మంత్రి పెద్దిరెడ్డి సీఎం జగన్ కు సన్నిహితులు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో పాటుగా ఎన్నికలు.. పార్టీలో సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ అనేక సందర్భాల్లో పెద్దిరెడ్డికే బాధ్యతలు అప్పగించారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సైతం జగన్ కు ఆప్తుడు. అయితే, ఇవన్నీ రాజకీయంగా చేస్తున్న విమర్శలే తప్ప..ఈ రెండు పార్టీల్లోనూ అటువంటి పరిస్థితులకు ఆస్కారమే లేదని.. అందునా కేసీఆర్ - జగన్ నాయకత్వంలో అటు వంటి సాహసం ఎవరూ చేయరంటూ రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.