అతడి పేరు పలికినా దరిద్రమే...గొంతు కోసుకుంటా: మంత్రి ఆది ఫైర్
కడప జిల్లా:మంత్రి ఆదినారాయణ రెడ్డి మరో సారి తన ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. తనను విమర్శించే స్థాయిలేని వారి పేరు ఉచ్చరించినా దరిద్రమని వైసీపీ జమ్మలమడుగు ఇన్చార్జి డాక్టర్ సుధీర్రెడ్డిని ఉద్దేశించి మంత్రి ఆదినారాయణరెడ్డి దుయ్యబట్టారు.
గురువారం సుధీర్రెడ్డి తనపై చేసిన విమర్శలను మంత్రి ఆదినారాయణరెడ్డి తిప్పికొట్టారు. ఎర్రగుంట్లలో నవనిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఆదినారాయణ రెడ్డి విలేకరులు సుధీర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాను ఇచ్చిన కుట్టుమిషన్లు పనిచేయడం లేదనడంపై తీవ్రంగా ప్రతిస్పందించిన ఆయన అవి నిజంగా పనిచేయడం లేదంటే గొంతుకోసుకుంటానని మండిపడ్డారు.
అసలు ఆ విమర్శలు చేసిన వ్యక్తి తన స్థాయికి తగడని, ఆయన సవాల్కు తన అనుచరులే సమాధానం చెబుతారన్నారు. మహిళలకు రూ.5వేలు చేసే కుట్టుమిషన్ను రూ.2,500లకే ఇప్పించానన్నారు....ఒక్కో గ్యాస్ కనెక్షన్ రూ.5వేలకు పైబడి అమ్మేసమయంలో తాను రూ.2500లకే వారికి ఇప్పించానన్నారు. కుట్టుమిషన్లు పనిచేయలేదంటే గొంతుకోసుకుంటానంటూ ఆవేశంతో ఊగిపోయారు.
అక్కడే ఉన్న కుట్టుమిషన్ శిక్షకురాలితో, కుట్టుమిషన్లు తీసుకున్న మహిళతో మాట్లాడారు. కుట్టుమిషన్లు పనిచేసినట్లైతే చప్పట్లతో హర్షం వ్యక్తం చేయాలని మహిళలను కోరారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శలు చేయడం కాదని...ఆరోపణలు చేసేటప్పుడు తెలుసుకుని చేయాలన్నారు. వైసిపి నేతలకు అభివృద్ధి అంటనే తెలియదని, వారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు.
తాను చేసిన అభివృద్ది గురించి తన అనుచరులు, ఛైర్మన్ ముసలయ్య, ఇతరులకు బాగా తెలుసని...తాను ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేసింది వారందరికీ బాగా తెలుసు కాబట్టి తనను విమర్శించిన వ్యక్తి సవాల్కు వారే సమాధానం చెబుతారన్నారు. అనంతరం నగర పంచాయతీ ఛైర్మన్ ముసలయ్య మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో తాము ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రతి సవాలు విసిరారు.