కెసిఆర్కు భయం: నారాయణ, అది వద్దు: వంశీచంద్
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా మతోన్మాదులకు భయపడుతున్నారని తెలుస్తోందని సిపిఐ నాయకుడు కె. నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా తెలంగాణ సాయుధా పోరాటానికి గుర్తింపు రాకపోవడం బాధాకరమని ఆయన మంగళవారంనాడు అన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విలీన దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్లో కరెంట్ అడిగిన రైతులపై లాఠీచార్జీ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. ఆస్టు 10,11 తేదీల్లో చండ్ర రాజశ్వేర రావు ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెసు కల్వకుర్తి శాసనసభ్యుడు వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. కరెంట్ కావాలని కోరిన రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దారుణమని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల పాటు కరెంట్ ఇస్తామని తెరాస ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోయిందని అన్నారు.
తెరాస అధికారంలోకి వచ్ిచన రెండు నెలల కాలంలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలో ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదని చెప్పారు. ఇకనైనా సెంటిమెంట్ రాజకీయాలు మానుకుని రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన కెసిఆర్కు సూచించారు.