జగన్లా పవన్కూ అదే ఆశ, రాజకీయమంటే అలా కాదు: మంత్రి ఆది ఎద్దేవా
కడప: మిత్రపక్షమైన బీజేపీయే నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్కు చుక్కలు చూపించిందని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే కచ్చితంగా అది వీడిపోతుందనే ఉద్దేశంతోనే టీడీపీ మద్దతు తెలుపలేదని ఆయన చెప్పారు.
జనసేన అధితేన పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయవేత్త అని, జగన్లాగే పవన్కు కూడా సీఎం కావాలన్న ఆశ ఉందని అన్నారు. అయితే రాజకీయమంటూ మూడు పాటలు, ఆరు డ్యూయట్లు కాదంటూ జనసేనానిని మంత్రి ఆది ఎద్దేవా చేశారు.
రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. జీడీపీని ఆధారంగా చేసుకొని నిధులు విడుదల చేయకపోవడం విచారకరమని మంత్రి వ్యాఖ్యానించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రం నుంచి నిధులు అవసరమన్నారు.
ఓటర్లు ప్రశాంత్ కిశోర్ కంటే తెలివైనవాళ్లని, ఆయన ట్రిక్కులు ఇక్కడ సాగవని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రజలు ఎనిమిది అంశాలపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.