టిడిపితో బిజెపి తెగదెంపులు: కిషన్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తాము సొంత బలాన్ని పెంచుకుంటామని, తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో పొత్తును కొనసాగించబోమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాము మొదటి నుంచి తెలంగాణ కోసం పోరాడినప్పటికీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా ఎక్కువ సీట్లను గెలుచుకోలేకపోయామని, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర పడిన తెలుగుదేశంతో పొత్తు కారణంగానే ప్రజలు తమకు ఓటు వేయలేదని ఆయన అన్నారు. ఆయన ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రికతో ఆ విషయం చెప్పారు.
పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనులను ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. గవర్నర్కు కేంద్రం హైదరాబాదుపై అధికారులు ఇవ్వడాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కెసిఆర్కు సలహా ఇచ్చారు. బిల్లులో ఈ క్లాజ్కు ప్రతి పార్టీ అంగీకరించిందని ఆయన గుర్తు చేశారు.
గవర్నర్కు అధికారులు కట్టబెట్టడమనేది తాత్కాలికమైందేనని, అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. తెలుగదేశం ప్రభుత్వం ఆంధ్ర రాజధానిని ఒకటి రెండేళ్లలో ఏర్పాటు చేసుకుని వెళ్లాలని భావిస్తోందని, గవర్నర్ అధికారాలు కూడా అప్పటి వరకే ఉంటాయని ఆయన చెప్పారు. తాము కెసిఆర్ ప్రభుత్వ పనితీరుపై ఆరు నెలలు చూసి ఆ తర్వాత స్పందించాలని అనుకున్నామని, అయితే కెసిఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.