విభజన ఉద్యమం టైంలో నేనెందుకు రాలేదంటే: పవన్, బాబుకు కష్టమే కానీ
గుంటూరు: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో తాను ఎందుకు బయటకు రాలేదనే విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు. రాజకీయ నాయకులు చేసే తప్పుకు ఇరు రాష్ట్రాల ప్రజలు కొట్టుకోవద్దనే ఉద్దేశ్యంతోనే తాను ఆగిపోయానని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు పలికారు. హఠాత్తుగా పవన్ రాజకీయాల్లోకి రావడంపై పలువురు అప్పుడు ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.
న్యాయపరమైన తెలంగాణ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు పలకలేదని కొందరు తెలంగాణవాదులు, సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎందుకు మద్దతు పలకలేదని పలువురు సమైక్యవాదులు ప్రశ్నించారు. దీని పైన పవన్ గురువారం స్పందించారు. రాజకీయ నాయకులు చేసే తప్పుకు ప్రజలు కొట్టుకోవద్దనే తాను రాలేదని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ.. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రంతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. సింగపూర్ లాంటి రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రశ్నించారు.
రుణమాఫీకి నిధులు ఎలా వస్తాయని నిలదీశారు. విభజన నేపథ్యంలో ఏపీకి రాజధాని లేదని, లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిల్లో చంద్రబాబుకు కష్టమేనని అభిప్రాయపడ్డారు. అయినా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలన్నారు.
పెట్టుబడీదారి వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. పెట్టుబడులు రావాలని, పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. ఐదేళ్ల తర్వాత న్యాయం చెస్తానని కొందరిలా చెప్పనన్న జగన్ను ఉద్దేశించి అన్నారు. రాజధానికి 33వేల ఎకరాలు అవసరమా అనేది ఆలోచించాలని దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతానని చెప్పారు. అవసరానికి మించి రైతుల నుంచి తీసుకుని భూములు అమ్మేశారనే వైయస్ను వ్యతిరేకించినట్లు పవన్ తెలిపారు.