రోజా జబర్దస్త్ వారసులెవరు?: రేసులో వారిద్దరూ: ఆ లోటు భర్తీ అవుతుందా?
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రోజా మంత్రిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పర్యాటకం, సాంస్కృతికం యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆమెకు లభించింది. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఆమె కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సినీ జీవితానికి తెర దించారు. ఇకపై సినిమాల్లో నటించట్లేదని ప్రకటించారు. ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో టెలికాస్ట్ అవుతోన్న స్టాండ్ అప్ కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్కు సైతం గుడ్బై చెప్పారు. ఇక ఇప్పట్లో రోజా సినిమాల్లో నటించే అవకాశాలు లేవు.
రోజా నిర్ణయంపై
సినిమాలకు దూరం కావడం.. జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనబోనంటూ రోజా చేసిన ప్రకటన పట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. శాసనసభ్యురాలిగా ఉన్న సమయంలోనే జబర్దస్త్ వంటి టీవీషోల్లో పాల్గొనడం పట్ల వైసీపీ కార్యకర్తలు పలు సందర్భాల్లో అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే హోదాలో అలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, మంత్రిగా తన బాధ్యతలను గుర్తించి- ఆ కార్యక్రమాన్ని వదులు కుంటూ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తోన్నారు.
జబర్దస్త్ జడ్జ్గా
రోజా జబర్దస్త్ జడ్జ్గా వైదొలగిన నేపథ్యంలో- ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుదీర్ఘకాలం పాటు రోజా ఈ కార్యక్రమంతో అసోసియేట్ అయి ఉన్నారు. 2013 నుంచీ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి- దాదాపు తెరమరుగైన పరిస్థితుల్లో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు రోజా. ప్రతి తెలుగింటినీ పలకరించారు. తోటి నటుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడుతో కలిసి న్యాయ నిర్ణేతలుగా పని చేశారు. జబర్దస్త్- మరింతగా జనంలోకి చొచ్చుకెళ్లడంలో ఆమె తనవంతు కీలక పాత్రను పోషించారు.
రోజా వారసులెవరు?
ఇప్పుడు రోజా ఈ టీవీషోనకు దూరం అయ్యారు. ఇప్పట్లో ఆమె ఇందులో కనిపించకపోవచ్చు. మంత్రిగా బాధ్యతలను నిర్వహించాల్సి ఉన్నందున ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుందనే కారణంతో స్వచ్ఛందంగా వైదొలిగారు. దీనితో ఆమె వారసులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో రెండు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి- ఇంద్రజ, రెండు- ఆమని. వీరిద్దరిలో ఒకరితో ఆ ఛానల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇందులో ఇంద్రజ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు.
ఇంద్రజతో..
ఇదివరకు రోజా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం కొన్ని వారాల పాటు రోజా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రోజా స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేశారు. జబర్దస్త్ ప్రోగ్రామ్లో మెరుపులు మెరిపించారు. ఆ అనుభవం ఉండటం వల్ల ఇప్పుడు ఇంద్రజ- పూర్తిస్థాయిలో న్యాయనిర్ణేతగా పని చేసే అవకాశాలు లేకపోలేదంటూ తెలుస్తోంది. రోజా కోలుకున్న తరువాత మళ్లీ జబర్దస్త్లో రీఎంట్రీ ఇచ్చారు. దీనితో ఇంద్రజ తప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ రోజా వైదొలగాల్సి రావడం వల్ల ఇంద్రజతోనే పూర్తిస్థాయి కాంట్రాక్ట్ కుదుర్చుకోవచ్చని చెబుతున్నారు.