పోలవరం కేసులో ట్విస్ట్- తప్పుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు- అసలేం జరిగింది ?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఓవైపు ఏపీ ప్రభుత్వం పోరాటం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రంతో నిధుల కోసం మరో పోరాటం కొనసాగుతోంది. ఇందులో మొదటిదైన పొరుగు రాష్ట్రాలతో న్యాయపోరాటం విషయంలో సుప్రీంకోర్టులో తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. నిన్న కేసు విచారణకు రాగానే ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇందుకు గల కారణాలపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పోలవరం పునరావాసం కేసు
పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్రెడ్డి గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్లో ఓ పిటిషన్ వేశారు. పునరావాసం పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని ఆయన ఎన్జీటీలో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ఇందులో భాగస్వాములుగా ఉన్న వారి వివరణ కోరింది. అదే సమయంలో ఒడిశా ప్రభుత్వం పునరావాసం వంటి కీలకమైన అంశంపై ఎన్జీటీ బదులుగా సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరింది. దీన్ని తిరస్కరిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఒడిశా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఒడిశా పిటిషన్పై సుప్రీం విచారణ
పునరావాసం పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మించడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఒడిశా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. పునరావాసం వంటి కీలక అంశంపై తాము సుప్రీంకోర్టు విచారణ కోరినా హరిత ట్రైబ్యునల్ నిరాకరించడాన్ని ఒడిశా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.
Recommended Video
విచారణ నుంచి తప్పుకున్న లావు నాగేశ్వరరావు
పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై ఒడిశా సర్కారు దాఖలు చేసిన పిటిషన్ విచారణను స్వీకరించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్ ధర్మాసనం ప్రాధమిక విచారణ చేపట్టింది. అయితే కేసు పరిశీలించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు తాను ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో పోలవరం కేసులో అడ్వకేట్గా వాదనలు వినిపించిన తాను ఇప్పుడు ఈ కేసు విచాఱణ చేపట్టలేనని లావు నాగేశ్వరరావు తెలిపారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేశారు.