మావోయిస్టులపై నిషేధాన్ని...మరో ఏడాది పొడిగించిన ఎపి ప్రభుత్వం:కేబినెట్ లో కీలక నిర్ణయం
అమరావతి:మావోయిస్టులపై నిషేధానికి సంబంధించి ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్ట్ పార్టీపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఏవోబీ కేంద్రంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్ట్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
మొదటిసారిగా 1992 మే నెలలో మావోయిస్ట్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి నిషేధం విధించారు. అప్పట్లో మావోయిస్ట్ పార్టీ సీపీఐ ఎంఎల్ (పీపుల్స్వార్) పేరుతో పనిచేసేది. పీపుల్వార్ అనుబంధసంఘాలైన రాడికల్ విద్యార్ధి సంఘం, రాడికల్ యువజనసంఘం, రైతుకూలి సంఘం, సింగరేణి కార్మిక సంఘం, ఆర్టీసీ కార్మిక సంఘం ఇలా ఆరు ప్రజాసంఘాలపై నిషేధాన్ని విదించారు.
ఈ నిషేధం విధించినందుకు ఆయనను తమ హిట్లిస్టులో నక్సలైట్లు చేర్చారు. ఆ క్రమంలో నక్సలైట్లు ఆయన్ను టార్గెట్ చేసి 2003 లో ఒకసారి, 2007 మరోసారి హతమార్చేందుకు యత్నించారు. 2007 సెప్టెంబర్ 7న రిమోట్ కంట్రోల్ ద్వారా మావోయిస్టులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కారు పేల్చివేయడానికి కుట్రపన్నగా జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ఈ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు. అయితే ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందారు.
తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్ట్లపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిని 2005 ఆగస్టు 15న మావోలు హత్య చేశారు. నర్సిరెడ్డితో పాటు తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో నర్సిరెడ్డి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంతో తిరిగి మావోలపై ఒక ఏడాది నిషేధం విధించారు.
ఆ తరువాత ఇలా అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీపై నిషేదాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అందులోభాగంగా టీడీపీ ప్రభుత్వం కూడా మరో ఏడాది మావోలపై నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిషేధంపై భిన్నవాదనలు వినపడుతున్నాయి. విప్లవ, పౌరహక్కుల సంఘాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. మావోయిస్ట్ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.