ప్రశాశం జిల్లా:కుప్పకూలిన విద్యుత్ స్థంభాలు...రైళ్ల రాకపోకలకు అంతరాయం
ప్రకాశం జిల్లా:ఎపిలో రైల్వే శాఖకు సంబంధించి పెను ముప్పు తప్పింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రైళ్ల రాకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వివరాల్లోకి వెళితే...
చెన్నై-విజయవాడ మార్గంలో గూడ్స్ ప్రయాణిస్తుండగా నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో దిగువమెట్ట-చెలమ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ పై ఒక చోట రైల్వే విద్యుత్ తీగలు కిందకి జారాయి. ఈ విషయాన్ని గమనించని గూడ్స్ డ్రైవర్ రైలును ముందుకు నడిపాడు. దీంతో ఈ తీగలు గూడ్స్ పై భాగానికి తగులుకొని ఆరు విద్యుత్ స్తంభాలు నేలను పెకలించుకొని ట్రాక్ కు ఇరువైపుల చెల్లా చెదురుగా పడ్డాయి. స్థానికుల అరుపులతో అప్రమప్తమైన గూడ్స్ డ్రైవర్ రైలు నిలిపివేశాడు.
మరోవైపు ఈ ఘటన కారణంగా బెంగుళూరు-విజయవాడ రూట్ నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి. అయితే విద్యుతీకరణ పనుల్లో నాణ్యత లేకపోవడం కారణంగానే విద్యుత్ తీగలు ఇలా కిందకి జారినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది.