ఉండవల్లి, హర్ష మళ్లీ యాక్టివ్: ఎటు వైపు?
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బిజెపిని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తి పోశారు. తాజాగా, హర్షకుమార్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిని కూడా తప్పు పట్టారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ అడుగు ముందుకు వేసి ఎపి రాజధాని భూముల ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణపై చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు.
వారిద్దరు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి, కాంగ్రెసు సహా అన్ని పార్టీలనూ ఎదుర్కోడానికి సిద్ధపడ్డారు. కానీ, అది ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు. అప్పటి నుంచి వారు రాజకీయంగా మౌనంగానే ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో వారు ముందుకు వచ్చారు. వారికి బిజెపిని, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి అత్యంత బలమైన అంశం లభించినట్లయింది.
అయితే, వారు ఎటు వైపు వెళ్తారనేది ఇప్పుడు అసక్తికరంగా మారింది. ఏ పార్టీలో చేరుతారనేది ప్రశ్నగానే ఉంది. అయితే, వచ్చే ఎన్నికలు సమీపించే వరకు వారు ఇలాగే రాజకీయంగా చురుగ్గా ఉంటారా, ఈలోగానే నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియడం లేదు. వారిద్దరు తిరిగి కాంగ్రెసు వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప జేయాలని ఆయన కాంగ్రెస్కు సూచించారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఏర్పడే అవకాశాలున్నాయని హర్షకుమార్ చెప్పారు. అలా అనడాన్ని బట్టి ఆయన ఇంకా కాంగ్రెసు వైపు ఉన్నారని అనుకోవడానికి వీలువుతోందని అంటున్నారు.
కాగా, ఆ మధ్య కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన కూడా ఆ వాదనకు బలం చేకూరుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తనతో టచ్లో ఉన్నారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దీంతో వారిద్దరు తిరిగి కాంగ్రెసులోకి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎపికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపినే కాకుండా టిడిపిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు పట్టారు. దీన్ని బట్టి కూడా ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని, కాంగ్రెసులోకి తిరిగి వెళ్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.