ఒత్తిడికి తలొగ్గిన జగన్ సర్కార్-ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతిపై కేసు నమోదు
ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారు డ్రైవర్ హత్య కేసులో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు ఇవాళ్టి వరకూ పోస్టుమార్టం కూడా జరగకుండా అడ్డుకోవడం, కాకినాడ ప్రభుత్వాసుపత్రికి టీడీపీ నిజనిర్ధారణ బృందం వెళ్లిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్యపై కేసు నమోదు చేసినట్లు ఇవాళ తిరుపతిలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. దీనిపై వైద్య నివేదికలు అందాక దర్యాప్తుప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. తద్వారా ఈ కేసును తాము సీరియస్ గానే తీసుకున్నట్లు పోలీసులు సంకేతాలు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో తన డ్రైవర్ మృతదేహం లభ్యం కావడం, అతను ప్రమాదంలో చనిపోయినట్లు ఎమ్మెల్సీ మృతుడి కుటుంబసభ్యులకు చెప్పడం, ఈ ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా దొరక్కపోవడంతో ఇదంతా కట్టుకథలాగే కనిపిస్తోంది. మరోవైపు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించి ఎమ్మెల్సీ పారిపోయారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, ఎమ్మెల్సీ కోసం గాలింపు చేపట్టకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సొంత పార్టీ ఎమ్మెల్సీని అజ్ఞాతంలోకి పంపిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్యపై కేసు నమోదు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. తదుపరి దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటే గానీ నిజానిజాలు బయటికి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏమేరకు పారదర్శకంగా దర్యాప్తు చేయిస్తుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.