చంద్రబాబు వ్యాఖ్యలు గాయపర్చాయి: గవర్నర్ ఏం పాపం చేశారని వీహెచ్ ఫైర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రజల విశ్వాసాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తనను ఎంతో గాయపర్చాయని సీనియర్ కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. పాపాలు చేసిన దేవాలయాలకు వెళ్తారంటూ చంద్రబాబు చేసినన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు తన వ్యాఖ్యలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వి హనుమంతరావు డిమాండ్ చేశారు. పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారని చంద్రబాబు చెప్పడం అమానుషమని అన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ తరచూ దేవాలయాలకు వెళ్తున్నారని, దానికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
అయ్యప్ప భక్తులను, భక్తిశ్రద్ధలతో వివిధ దేవుళ్ల మాలలు వేసి దీక్ష చేసే వారిని అవమానించేలా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గత సంప్రదాయాన్ని పాటించాలని అన్నారు. గతంలో టిఆర్ఎస్ నేత కేశవరావుకు మద్దతిచ్చి రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించామని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ మద్దతివ్వాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఎన్నికల్లో రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సోనియా అవకామిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాని చెప్పారు.