జగన్ మరో భారీ ప్రయోగం-ఆ 58 ఎమ్మెల్యే, 12 ఎంపీ సీట్లలో- గెలుపుగుర్రాల్ని తేల్చేందుకే !
ఏపీలో వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న సీఎం జగన్ అందుకోసం కొత్త ప్రయోగాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఉంటే పోటీ వాతావరణాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. పోటీ ఉంటే తప్ప తమ ప్రజాప్రతినిధులు మరోసారి గెలుపుపై దృష్టిపెట్టేలా లేరని భావిస్తున్న జగన్.. తాజాగా అమరావతితో ఈ ప్రయోగాన్ని ప్రారంభించేశారు. అంతే కాదు మరికొన్నచోట్ల ఇలాంటి ప్రయోగాలు తప్పవన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

జగన్ 175 సీట్ల టార్గెట్
ఏపీలో 2019లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీని 151 సీట్లతో అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఇప్పుడు ఏకంగా 175 ఎమ్మెల్యేల టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ సమావేశాల్లో ప్రతీ సారీ 175 మార్క్ పై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ టార్గెట్ రీచ్ కావడంలో ఎక్కడా విఫలం కాకూడదని, దీని కోసం తాను దేనికైనా సిద్ధం అవుతానన్న సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే గడప గడపకూ ప్రభుత్వం పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ఇందులో విఫలమైతే మాత్రం టికెట్లు కూడా ఇవ్వనని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. దీంతో జగన్ మాటను మెజార్టీ ఎమ్మెల్యేలు సీరియస్ గానే తీసుకుంటున్నారు. మిగతా వారు మాత్రం లైట్ తీసుకుంటూనే ఉన్నారు. వారిపై జగన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

జగన్ తాజా ప్రయోగం
వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం మాత్రమే కాదు తాను అనుకున్న విధంగా 175 సీట్ల మార్క్ అందుకునేలా చేయడానికి జగన్ ఏమాత్రం రిస్క్ తీసుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే ఇప్పడు తనకు అందుబాటులో ఉన్న సమయంలోనే కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. వాటి ద్వారా పనిచేయని ఎమ్మెల్యేను ఏకపక్షంగా సాగనంపకుండా వారికి కూడా ఓ చివరి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం కొత్తగా అదనపు ఇన్ ఛార్జ్ ల వ్యవస్ధను అమల్లోకి తీసుకొస్తున్నారు. వైసీపీ బలహీనంగా ఉన్న తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు.

58 ఎమ్మెల్యే సీట్లలో ఇన్ ఛార్జ్ లు ?
ఇలా అదనపు ఇన్ ఛార్జ్ లను నియమించడం ద్వారా నిర్లక్ష్యంగా ఉన్న సిట్టింగ్ లలో పోటీ తత్వం నింపాలనుకుంటున్న నియోజకవర్గాల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. గడప గడపలో వస్తున్న ఫీడ్ బ్యాక్, తాజాగా చేయించిన సర్వేల ఆధారంగా ఈ మార్పులు చేయబోతున్నారు. ఈ లెక్కన 58 అసెంబ్లీ సీట్లతో పాటు 12 ఎంపీ సీట్లలోనూ అదనపు ఇన్ ఛార్జ్ ల నియామకం తప్పేలా లేదు. వీటిలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు, పర్చూరు, కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం, కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, ఎచ్చెర్ర, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం,వైజాగ్ ఈస్ట్, సౌత్, పాయకరావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పిఠాపురం, పాడేరు, జగ్గంపేట,ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్,మైలవరం, కైకలూరు, అవనిగడ్డ, పూతలపట్టు, పలమనేరు, శింగనమల, పత్తికొండ, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, కళ్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

12 ఎంపీ సీట్లలోనూ ఇన్ ఛార్జ్ లు ?
ఇదే క్రమంలో పార్లమెంటు సీట్లలోనూ అదనపు ఇన్ ఛార్జ్ లను జగన్ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వీటిలో హిందూపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అదనపు ఇన్ ఛార్జ్ లను నియమించడం ద్వారా సిట్టింగ్ లతో వారికి పోటీ పెడుతున్నట్లు సమాచారం. ఈ పోరులో ఎవరు ముందుంటే వారికే టికెట్లు కేటాయించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ పోరు వైసీపీకి అంతిమంగా మేలు చేస్తుందా లేదా చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications