AP Assembly : టీడీపీ ఎమ్మెల్యేల నిత్య సస్పెన్షన్లు-ఇదీ వ్యూహాత్మకమేనా ! వైసీపీకి కావాల్సింది అదే !
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగిపోతున్నాయి. ప్రభుత్వం, అధికార పక్షం మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ లేకపోవడం, విపక్షాల వాయిదా తీర్మానాలతో సహా ఏ డిమాండ్ నూ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అలాగే అధికార పక్షం బిల్లులపై చర్చ కంటే విమర్శలపై వివరణలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణమవుతోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పోరు, అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.

వైసీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పోరు నానాటికీ తీవ్రమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు విపక్ష నేత చంద్రబాబు దూరంగా ఉంటున్నా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం హాజరవుతున్నారు. దీంతో వారు చేస్తున్న డిమాండ్లకు, లేవనెత్తుతున్న అంశాలకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ బయట వస్తున్న విమర్శలకు సభా వేదికగా సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో మిగతా అజెండా అంతా పక్కదారి పట్టేలా ఉంది. ముఖ్యంగా బిల్లులపై చర్చలు లేకుండా పోతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీలో కీలకమైన బిల్లులపై చర్చ జరిగి అన్ని పక్షాల వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా అధికార పక్షం మాత్రం పైచేయి కోసం ప్రయత్నిస్తోంది. దీంతో బిల్లులపై చర్చ కంటే రోజుకో అంశంపై చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా నిత్యం టీడీపీ, కొన్ని మీడియా సంస్ధలు చేసే విమర్శలను అసెంబ్లీ వేదికగా ఖండించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో టీడీపీ సభ్యులు నిరసనలకు దిగుతున్నారు. వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో టీడీపీ సభ్యుల సస్పెన్షన్లు తప్పడం లేదు. ఇవి కూడా రోజూ కొనసాగుతుండటంతో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సస్పెన్షన్లు వ్యూహాత్మకమేనా ?
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు దాటిపోయింది. రేపటితో సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ టీడీపీ సభ్యులు మూడు రోజుల పాటు వరుసగా సస్పెండ్ అయ్యారు. వీరు అసెంబ్లీలో ఎప్పటికప్పుడు నిరసనలకు దిగడం, వారిని సస్పెండ్ చేసి తాము అనుకున్న విధంగా అధికార పక్షం సభను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇదో నిత్యకృత్యంగా మారిపోతోంది. అయితే సభలో ఎలాగో అధికార వైసీపీ తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వదని తెలిసే టీడీపీ సభ్యులు ఇలా నిరసనలకు దిగి సస్పెండ్ అవుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే అధికార వైసీపీ కూడా టీడీపీ సభ్యులు సభలో ఉంటే తాము అనుకున్న విధంగా చర్చలు కానీ, నిర్ణయాలు కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్ధితి లేకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరుపార్టీలు ఉమ్మడిగా ఈ సస్పెన్షన్ల వ్యవహారాన్ని రక్తికట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications