health tips: సూర్యాస్తమయం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్త అంటున్న వైద్యులు; ఎందుకంటే!!
సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ పని చేయకండి, చిన్న పొరపాటు వల్ల జీర్ణవ్యవస్థ పాడవుతుంది. మధుమేహం ఉంటే మరింత జాగ్రత్త వహించండి అంటున్నారు వైద్య నిపుణులు,డైటీషియన్లు . ఇంతకీ దేని గురించి ఇంతగా చెప్తున్నారంటే..
పండ్లు తినటం మంచిదే కానీ సమయపాలన ముఖ్యం అంటున్న డైటీషియన్లు
ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు ఎక్కువగా తినాలి అని చెబుతుంటారు. అయితే పండ్లు అధికంగా తినడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుందని, పండ్లు సకాలంలో తీసుకోకపోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రయోజనం కలగడానికి బదులు హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యంగా జీవించాలంటే ఏ పని చేయాలన్నా సమయపాలన పాటించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
ఏ సమయంలో ఆహారం తీసుకోవాలో, ఏ సమయంలో ఆహారం తీసుకోకూడదో తెలుసుకుంటే చాలా వ్యాధులనుండి రక్షణ పొందొచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? వారు పండ్లను తీసుకుంటే ఏ సమయంలో తీసుకోవాలి? అనే అనేక వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తినడం మంచిదేనా?
పండ్ల వినియోగం ఆరోగ్యానికి ఉత్తమమైనది. కానీ చాలాసార్లు ప్రజలు తమ ఇష్టానికి మరియు సౌకర్యానికి అనుగుణంగా పండ్లను తీసుకుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు.
పండ్లు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, రాత్రి సమయంలో తీసుకోకూడని చాలా పండ్లు ఉన్నాయి అని, సూర్యాస్తమయం తరువాత కొన్ని రకాల పండ్లను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పాడవుతుందని చెబుతున్నారు. ఇక మధుమేహం ఉన్నవారు సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు సూర్యాస్తమయం తర్వాత పండ్లు తినొచ్చా?
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు సూర్యాస్తమయం తరువాత మరిచిపోయి కూడా పండ్లు తినకూడదు. రాత్రిపూట పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం మరింత వేగంగా పెరుగుతుంది. ఇది కాకుండా, ఇతర ఆహారాలతో పాటు పండ్లు తినకూడదు. ఇది శరీరంలో విషపూరితం కూడా కావచ్చు అని చెబుతున్నారు. మితంగా పండ్లను తీసుకోవాలని, చక్కెర శాతం ఎక్కువగా ఉండే కొన్ని రకాల పండ్లను తీసుకోకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. పండ్లలో గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమేర పండ్లను తినవచ్చని, అలా అని అధికంగా పండ్లను తినకూడదని చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఏం జరుగుతుంది?
నిజానికి, పండ్లలో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది సులభంగా కొవ్వుగా మారుతుంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పండ్లు తినడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పండ్లు తినాలి అనుకునేవారు సూర్యాస్తమయానికి ముందు పండ్లను తినాలి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడానికి ప్రయత్నించండి. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
రాత్రిపూట పండ్లను తినడం వల్ల జరిగేది ఇదే!!
సాయంత్రం పూట పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. తద్వారా రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది. పండ్లను రాత్రిపూట తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరియు శక్తి స్థాయిలు పెరుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత జీవక్రియ మందగిస్తుంది కాబట్టి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే అది రాత్రి పూట మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక చాలా పండ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రాత్రిపూట పండ్లు తినకూడదని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.