తోబుట్టువుకే ఎసరు.. అక్క ఆస్తిపై నజర్.. మరో సంచలన తీర్పు..!
హైదరాబాద్ : ఆస్తుల కోసం బంధాలు బజారుపాలవుతున్నాయి. తల్లిదండ్రులను వేధించే కొడుకులున్నారు. తోబుట్టువులను మోసగించే ప్రబుద్ధులున్నారు. కని పెంచిన అమ్మనాన్నలను రోడ్డు పాలు చేస్తూ ఆస్తులను కబ్జా చేసేవారు కొందరైతే.. రక్తబంధానికి మచ్చ తెచ్చేలా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలు చిచ్చు రేపుతున్నాయి.
ఆ క్రమంలో ఒక్క రోజు వ్యవధిలో మల్కాజిగిరి కోర్టు రెండు సంచలన తీర్పులు ఇచ్చింది. అమ్మను ఆస్తి కోసం వేధించిన కేసులో కొడుక్కి, ఆయన భార్యకు మల్కాజిగిరి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. మరునాడే ఆస్తి కోసం సొంత అక్కను వంచించిన కేసులో ఇద్దరు సోదరులకు, చెల్లెలికి మూడేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. అంతేకాదు వారికి సహకరించిన తల్లిని కూడా న్యాయస్థానం వదల్లేదు.
అక్క ఆస్తి కాజేయాలని ప్లాన్.. తల్లి, చెల్లి సహకారం
నేరెడ్మెట్ ప్రాంతంలోని కాకతీయనగర్కు చెందిన అరుణ జ్యోతికి పెళ్లయి అత్తగారింట్లో ఉంటోంది. ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అయితే అరుణ జ్యోతికి తండ్రి లక్ష్మినారాయణ 1986వ సంవత్సరంలో 160 చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుపైనే చేయించారు. పెళ్లైన తర్వాత నుంచి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు పుట్టింట్లోనే ఉంటున్నాయి.
అదలావుంటే అక్క ఆస్తిపై కన్నేసిన సోదరులు సర్వేష్, నాగసాయి, సోదరి శ్రీదేవి అదే భవనంలో నివసిస్తున్నారు. వీరికి తల్లి కళావతి కూడా సపోర్ట్గా నిలిచారు. ఆ క్రమంలో కబ్జా చేయాలనే దురాలోచనతో సర్వేష్ తెలివిగా వ్యవహరించాడు. సోదరుడు నాగసాయికి ఆ ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేస్తూ డాక్యుమెంట్లు సృష్టించారు. దానిపై మరో సోదరి శ్రీదేవితో పాటు తల్లి కళావతి సాక్షులుగా సంతకాలు పెట్టేశారు. దాంతో అరుణ జ్యోతి ప్రాపర్టీ కాస్తా.. నాగసాయి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది.
"అమ్మ" కు ఆస్తి వేధింపులు.. కోర్టు సంచలన తీర్పు..!
అక్క ప్రాపర్టీ కబ్జా.. ఫోర్జరీ పత్రాలతో ఛీటింగ్
విషయం కాస్తా అరుణ జ్యోతి దృష్టికి వెళ్లడంతో పుట్టింట్లో వదిలేసి వెళ్లిన ఆ ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా తల్లిని కోరింది. అయితే ఆ తల్లి మాత్రం డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు తన ఇద్దరు కొడుకులతో పాటు మరో కూతురితో కలిసి అరుణ జ్యోతిని బెదిరించారు. ఆ ప్రాపర్టీతో తనకు సంబంధం లేదని, ఏం చేస్తావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు.
కన్నతల్లితో పాటు తోబుట్టువులు ఇలా మోసగిస్తారని ఏనాడు కూడా కలలో ఊహించని అరుణ జ్యోతి చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. 2015, మార్చి 11వ తేదీన కేసు నమోదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో ఫోర్జరీ జరిగినట్లు నిర్థారించారు. ఆ మేరకు అరుణ జ్యోతి తల్లి కళావతితో పాటు ఇద్దరు సోదరులు, ఒక సోదరిని అరెస్ట్ చేశారు. అనంతరం మల్కాజిగిరి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు.
ఒక్క రోజు వ్యవధిలో రెండు.. మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పులు
అక్కను తోబుట్టువులే వంచించిన ఈ కేసులో దాదాపు నాలుగేళ్ల పాటు మల్కాజిగిరి 19వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. చివరకు నలుగుర్ని నిందితులుగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో సూత్రధారులుగా సర్వేశ్, శ్రీదేవికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించగా.. కళావతి, నాగసాయికి ఏడాది జైలుతో పాటు 10వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేకంగా అభినందించారు.
అదలావుంటే సోమవారం నాడు తల్లిని వేధించిన కొడుక్కి, ఆయన భార్యకు రెండేళ్ల జైలుశిక్ష, 10వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది ఇదే కోర్టు. ఒక్క రోజు వ్యవధిలో రెండు కేసుల్లో ఇలాంటి సంచలన తీర్పులు వెలువరించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.