ఆ 9 కార్పోరేట్ గ్రూప్ల చేతుల్లోనే సగం వ్యాక్సిన్లు - టీకా విధానంలో కేంద్రం వివక్ష ?
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతున్న వేళ చికిత్స పేరుతో కార్పోరేట్ ఆస్పత్రుల ఫీజుల దోపిడీ చూస్తునే ఉన్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ల విషయంలోనూ కార్పోరేట్ ఆస్పత్రుల ఆధిపత్యం కొనసాగుతుందనడానికి నిదర్శనంగా తాజాగా గణాంకాలు వెలుగుచూశాయి. ఇందులో కేంద్రం కొత్త వ్యాక్సిన్ల విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రైవేటు రంగంలోకి కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో సగానికి పైగా 9 కార్పోరేట్ ఆస్పత్రుల గ్రూపులే కొనుగోలు చేశాయంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధమవుతోంది.
వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన వ్యాక్సిన్ల పంపిణీ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతుంటే సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్న కేంద్రం... మరోవైపు ప్రైవేటు రంగానికి మాత్రం నేరుగా భారీ ఎత్తున వ్యాక్సిన్లను పంపిణీ చేయిస్తుండటం, అందులోనూ కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల గ్రూపులే ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సమానత్వం పాటించాల్సిన కేంద్రం.. కార్పోరేట్ ఆస్పత్రులపై చూపుతున్న అవాజ్యమైన ప్రేమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సగానికి పైగా డోసులు వారికే
దేశవ్యాప్తంగా కేంద్రం తాజాగా వ్యాక్సిన్ల విధానం తీసుకొచ్చిన తర్వాత మే నెలలో మొత్తం 1.20 కోట్ల వ్యాక్సిన్లను ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రులు సమకూర్చుకున్నాయి. ఇందులో 9 కార్పోరేట్ ఆస్పత్రుల గ్రూపులే ఏకంగా 60 లక్షలకు పైగా వ్యాక్సిన్లను దక్కించుకున్నాయి. మిగతా 60 లక్షల వ్యాక్సిన్లను 300కు పైగా ఆస్పత్రులు కొనుగోలు చేయగలిగాయి. ఇవన్నీ ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలోనివే. దీన్ని బట్టి చూస్తే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
9 కార్పోరేట్ గ్రూపుల చేతుల్లో సగం వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి సగం డోసులు కేంద్రం, మరో సగం ప్రైవేటు ఆస్పత్రులు తీసుకుంటున్నాయి. ఇందులోనూ దేశంలోని ఏడు కార్పోరేట్ ఆస్పత్రుల గ్రూప్లు సగానికి పైగా డోసులు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా వ్యాక్సిన్లను అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్కేర్, హెచ్ఎన్ రిలయన్స్, మెడికా హాస్పిటల్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్, గోద్రెజ్ మెమోరియల్, మణిపాల్ హెల్త్, టెక్నో ఇండియా, నారాయణ హృదయాలయ గ్రూపులు ఉన్నాయి.
ప్రైవేటు దోపిడీకి కేంద్రం రాజమార్గం
మే నెలలో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త వ్యాక్సిన్ల విధానంలో మొత్తం తయారీ దారుల వద్ద ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసేందుకు కేంద్రం అధికారికంగానే అనుమతిచ్చింది. దీంతో రాజమార్గంలోనే మొత్తం వ్యాక్సిన్లలో సగం ప్రైవేటు ఆస్పత్పుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇక మిగిలిన 50 శాతం రాష్ట్రాలకు ఎటూ సరిపోక విమర్శలకు దిగుతున్నాయి. దీంతో కేంద్రం, రాష్ట్రాల మధ్య అనవసరంగా అగాధం పెరుగుతోంది.