గుజరాత్ అసెంబ్లీ పోరు-పటీదార్లపైనే ఆప్ ఆశలన్నీ- బీజేపీ బలాన్ని దెబ్బకొట్టే యత్నం
గుజరాత్ అసెంబ్లీ పోరు రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతున్నాయి. దీంతో ఇరుపార్టీల్ని ఎదుర్కొనేందుకు అపసోపాలు పడుతున్న బీజేపీ.. చివరికి వీరి మధ్య ఓట్ల చీలికతో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో బీజేపీకి మద్దతుదారులుగా ఉన్న పటీదార్లను ఈసారి తమవైపు తిప్పుకునేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
బీజేపీకి పోటీగా పటీదార్లకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గతంలో రిజర్వేషన్ల పోరు సందర్భంగా బీజేపీ వ్యవహరించిన తీరును ఓటర్లకు గుర్తుచేస్తోంది. గత ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమం సందర్భంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దాన్ని నెరవేర్చలేదు. దీంతోపాటు పటీదార్ల ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది యువత ఇప్పటికీ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
2015లో పటీదార్ ఉద్యమం సందర్భంగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం వారిని అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఇది హింసాత్మకంగా మారడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పటీదార్లు బీజేపీకి దూరమవుతూ వస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఉద్యమాన్ని నడిపించిన హార్ధిక్ పటేల్ సైతం కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ కంటే బీజేపీయే నయమని భావించి తిరిగి వచ్చేశారు. అప్పటికే బీజేపీ సర్కార్ కేసులతో ఆయన్ను తన స్వస్ధలం మొహసినాకు దూరం చేసింది. దీంతో ఇప్పుడు తిరిగి హార్దిక్ పటేల్ ను రప్పిస్తున్న బీజేపీ ఆయనసాయంతో పటీదార్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆప్ దానికి దెబ్బకొడుతోంది.