సోనియా గాంధీకి మరో షాక్-వ్యక్తిగత కార్యదర్శిపై రేప్ ఆరోపణలు-కేసు నమోదు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెను నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఆమె వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ఉద్యోగం ఇప్పిస్తానని తనను రేప్ చేశారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోరీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
తనకు ఉద్యోగం ఇప్పించడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్ తనను వాడుకున్నాడని సదరు మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించినట్లు తెలిపింది. ఈ మేరకు జూన్ 25న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. దీంతో మాధవన్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సోనియా వ్యక్తిగత కార్యదర్శిపై ఆరోపణలు చేసిన సదరు మహిళ ఢిల్లీలో నివసిస్తుందని, ఆమె భర్త 2020లో చనిపోయారని అధికారులు తెలిపారు. భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడని, అతను హోర్డింగ్లు అతికించేవాడని వారు తెలిపారు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఆమెపై మాధవన్ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని, అధినేత్రి సోనియా, రాహుల్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.












Click it and Unblock the Notifications