కేంద్రంపై అనుపమ్ ఖేర్ షాకింగ్ కామెంట్స్... కోవిడ్ను డీల్ చేయడంలో వైఫల్యం.. ఎక్కడో చతికిలపడ్డారని...
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనను గట్టిగా సమర్థించే ఆయన మొదటిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. కరోనా పరిస్థితులను డీల్ చేయడంలో ప్రభుత్వం ఎక్కడో చతికిలపడినట్లు కనిపిస్తోందని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జీవితమంటే కేవలం ప్రతిష్ఠను పెంచుకోవడం కాదని... అంతకుమించి అని బీజేపీ పాలకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పాలనను,నిర్ణయాలను ఎప్పుడూ వెనకేసుకొచ్చే అనుపమ్ ఖేర్ మొదటిసారి ఇలా వ్యతిరేక స్వరం వినిపించడం చర్చనీయాంశమైంది.
అనుపమ్ ఖేర్ ఇంకా ఏమన్నారు...
తాజాగా ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నాల కన్నా పరిస్థితులను చక్కదిద్దడంపై ఫోకస్ చేయాలన్న వాదనతో అనుపమ్ ఖేర్ ఏకీభవించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను ఎన్నుకున్న ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. 'చాలా సందర్భాల్లో విమర్శలు సరైన ధోరణితోనే ఉంటున్నాయి... మానవత్వం లేనివాళ్లకే నదుల్లో శవాలు కొట్టుకొస్తున్నా ఎలాంటి భావన కలగదు..' అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.
అలా చేయడం కూడా సరికాదని...
ఇప్పుడున్న పరిస్థితులను డీల్ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని చెప్పి మరో పార్టీ దాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కూడా సరైనది కాదని అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. ప్రజలుగా మన కళ్ల ముందు కనిపిస్తున్నవాటికి మనకు కోపం రావడంలో తప్పు లేదు. జరుగుతున్న దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎక్కడో ప్రభుత్వం చతికిలపడింది. జీవితమంటే కేవలం ప్రతిష్ఠను పెంచుకోవడం కాదు... అంతకుమించి అని వారు అర్థం చేసుకోవాలి.' అని పేర్కొన్నారు.
Recommended Video
బీజేపీ నేతలు స్పందిస్తారా?
అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలెవరైనా స్పందిస్తారా.. స్పందిస్తే ఏం బదులిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కరోనా బారినపడి మృతి చెందినట్లు కొద్దిరోజుల క్రితం ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. అనుపమ్ ఖేర్ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆమె నిక్షేపంగా ఉందని... ఇటీవలే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు కూడా తీసుకుందని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అనుపమ్ ఖేర్ తనవంతుగా వెంటిలేటర్లు,ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తదితర మెడికల్ పరికరాలను ముంబై,కాన్పూర్,ఢిల్లీ,పుణే,ఘాజీపూర్లలోని పలు ఆస్పత్రులకు అందజేశారు.