పాసైతేనే పైతరగతికి, 8వ తరగతి వరకు అమలు: ఎన్నారైలకు ఓటు
ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పైతరగతికి వెళ్లే విధానాన్ని 8వ తరగతి వరకు రద్దు చేయాలని కేంద్ర మండలి నిర్ణయించింది. ప్రధాని మోడ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పైతరగతికి వెళ్లే విధానాన్ని 8వ తరగతి వరకు రద్దు చేయాలని కేంద్ర మండలి నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్ని 5, 8 తరగతుల్లో నిలిపేయడానికి రాష్ట్రాలకు వీలు కల్పించేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు సవరణ బిల్లులో తగిన మార్పులు చేయనున్నారు.
విద్యార్థుల్ని అదే తరగతిలో నిలిపివేయడానికి ముందు వారు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ మేరకు బిల్లును ఆమోదం నిమిత్తం పార్లమెంటులో ప్రవేశపెడతారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు ఆయా తరగతుల్లో ఉత్తీర్ణులు కాకపోయినా 8వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైతరగతికి వెళ్లగలుగుతున్నారు.
ఎన్నారైలకు ఓటు హక్కు
ఎన్నారైలకు భారత్లో ఓటు వేయడానికి వీలు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించనున్నారు. ఎన్నారైలు ఏ నియోజకవర్గంలో తమ పేరు నమోదు చేయించుకుంటే అక్కడ ఓటు వేయడానికి వీలుంటుంది.
ప్రస్తుతం రక్షణరంగ సిబ్బందికి మాత్రమే అవకాశం ఉన్న రీతిలో ఎన్నారైలు కూడా తమ తరఫున ఓటు వేసే హక్కును మరొకరికి ఇచ్చేందుకు అనుమతించనున్నారు.
ఇలాంటి అవకాశం కల్పించాలంటూ ఎన్నికల సంఘం నిపుణుల కమిటీ సూచించింది. ఖర్చులు భరించి భారత్కు వచ్చి ఓటు వేసి వెళ్తున్న ప్రవాసులు 10000 నుంచి 12000 మంది లోపు ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.