వైఎస్, జగన్ బాటలో ప్రియాంకా గాంధీ-యూపీలో కీలక హామీ-నాడు వైఎస్ ను నిందించి.. ఇప్పుడు
యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక హామీలు గుప్పిస్తోంది. ఇఫ్పటికే మహిళలకు ఎన్నికల్లో 40 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇవాళ మరో కీలక హామీ ఇచ్చారు. గతంలో యూపీలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ప్రియాంక గాంధీ ఇచ్చిన ఆ హామీపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న ఈ హామీని ప్రియాంక కూడా ఇవ్వడంతో దీనిపై చర్చ సాగుతోంది.
యూపీలో కాంగ్రెస్ పోరు
భారత్ లో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి ప్రాణగండంగా మారిపోయాయి. గతంలో అలవోకగా యూపీని స్వీప్ చేసిన బీజేపీ. ఈసారి ఎన్నికల్లో మాత్రం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దీంతో బీజేపీ స్ధానంలో పాగా వేసేందుకు మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
దశాబ్దాల క్రితం యూపీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. తిరిగి పుంజుకోవడం సంగతి అటుంచి నానాటికీ పతనం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ పోరును కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ప్రియాంకగాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
దూసుకుపోతున్న ప్రియాంక
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలో నిలపాలన్నా, కనీస స్ధానాలు గెల్చుకుని ఉనికిని చాటుకోవాలన్నా ఇప్పుడు ప్రియాంకగాంధీకి దూకుడుగా నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్ధితి. దీంతో ఆమె రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా క్షణాల్లో అక్కడికి వెళ్లిపోతున్నారు. వరుస పర్యటనలతో యోగీ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో కొత్త కొత్త హామీలతో ప్రత్యర్ధులకు వరుస సవాళ్లు విసురుతున్నారు. దీంతో బీజేపీతో పాటు ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా ప్రియాంక అడుగుల్ని నిశితంగా గమనిస్తున్నాయి.
ప్రియాంక కొంగొత్త హామీలు
కుల ప్రభావం ఎక్కువగా ఉండే యూపీలో అక్కడి సమీకరణాల్ని గెలవడం కాంగ్రెస్ పార్టీ వల్ల కావడం లేదు. మారిన పరిస్దితుల్లో దశాబ్దాల క్రితమే అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. చివరికి అమేథీ, రాయ్ బరేలీ వంటి కంచుకోటల్లోనూ పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. 2019లో అయితే కాంగ్రెస్ అధినేతగా ఉన్న రాహుల్ గాంంధీ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మార్చింది. ఇప్పుడు ప్రియాంక వరుసగా ప్రకటిస్తున్న కొత్త హామీల వెనుక ఈ వ్యూహమే దాగుంది. తాజాగా ప్రియాంక ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ మహిళలకు 40 సీట్లు ఇస్తామని ప్రకటించింది. దాని తర్వాత ఇప్పుడు మరో కీలక హామీ ఇచ్చ్చింది.
ప్రియాంక ఉచిత వైద్యం హామీ
యూపీలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ప్రియాంక గాంధీ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన యూపీలో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో కరోనా సందర్భంగా యోగీ సర్కార్ వైఫల్యాలకు ఇదో కారణం. దీంతో ఇప్పుడు ప్రియాంక దాన్ని టార్గెట్ చేసుకుని పేదలకు ఉచిత వైద్యం హామీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకూ ఖర్చుతో ఉచిత వైద్యం అందిస్తామని ప్రియాంక గాంధీ కీలక హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ హామీ యూపీ పార్టీల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
వైఎస్, జగన్ బాటలో ప్రియాంక
ఏపీలో గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల తర్వాత ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో దీన్ని అమలు చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. చివరికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశల్లేని పరిస్ధితి నుంచి ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో మరోసారి అధికారంలోకి రావడంలో వైఎస్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికీ వైఎస్ తనయుడు జగన్ తో పాటు అంతకు ముందు ఉమ్మడి ఏపీకి పనిచేసిన సీఎంలు, తెలంగాణ సీఎం కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా యూపీలో ఉచిత వైద్యం హామీతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Recommended Video
నాడు వైఎస్ ను నిందించి, ఇప్పుడు యూపీలో
గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎంగా వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేశారు. దీంతో ఆయన హయాంలో పేదలకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వేల కొద్దీ ఆపరేషన్లు ఉచితంగా పేదలకు జరిగాయి. దీంతో 2009 ఎన్నికల్లోనూ జనం ఆయనకు మరోసారి పట్టం కట్టారు. కానీ వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసి ఆయనపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఆరోగ్య శ్రీ పేరుతో ఆస్పత్రులకు దోచిపెట్టారంటూ విమర్శలకు దిగారు. గతంలో టీడీపీ చేసిన విమర్శల్ని కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. ఇప్పుడు తిరిగి అదే పథకాన్ని మరో రూపంలో యూపీలో అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.