నిరసనల విరమణపై రేపు రైతు సంఘాల నిర్ణయం-కేసులు వెనక్కి తీసుకుంటున్న రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాలు.. త్వరలో వాటిని విరమించబోతున్నారు. తాము కోరిన విధంగా కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవడం, రైతులపై పెట్టిన కేసుల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడంతో రైతులు వెనక్కితగ్గాలని నిర్ణయించారు.
కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రైతులు నిరసనలు విరమించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో రైతులు కనీస మద్దతుధరకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కీలకమైన వ్యవసాయ బిల్లులు రద్దయిపోయాయి కాబట్టి ఇకనైనా ఇళ్లకు వెళ్లాలని కేంద్రం వారిని కోరుతోంది. దీంతో ఇవాళ సమావేశమైన రైతు సంఘాలు.. ఆందోళన విరమణపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ రైతు సంఘాలు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం రేపటి్కి వాయిదా పడింది.
ఇవాళ జరిగిన రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా భేటీలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రేపు మరోసారి సమావేశం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకుందని రైతు నేత రాకేష్ తికాయత్ వెల్లడించారు. రైతుల డిమాండ్లపై వివరణ ఇస్తూ కేంద్రం ఇప్పటికే ముసాయిదా పంపింది. కేంద్రం పంపిన వివరణలోని కొన్ని అంశాలపై స్పష్టత కోరుతూ కేంద్రానికి కిసాన్ మోర్చా లేఖ రాసింది. దీంతో కేంద్రం వివరణ ఇచ్చాక దానిపై చర్చించి ధర్నా ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.
Recommended Video
మరోవైపు రైతులపై గతంలో నమోదైన 240 కేసులను ఉపసంహరించుకోవడానికి హర్యానా సర్కార్ అంగీకరించింది. ఇప్పటికే రైతులపై కేసులను పంజాబ్ సర్కార్ ఉపసంహరించుకుంది. అలాగే లఖీంపూర్ ఘటనలో రైతులపై నమోదైన కేసులను యూపీ సర్కార్ కూడా వెనక్కి తీసుకుంది. దీంతో ఇక హర్యానా సర్కార్ కూడా కేసులు వెనక్కి తీసుకుంటే ఇక రైతుల నిరసన ముగింపుకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ఏడాదికి పైగా రైతులు చేపట్టిన నిరసనలతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. ఓ దశలో సుప్రీంకోర్టు సైతం రైతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం కూడా వ్యవసాయ చట్టాలపై వెనక్కితగ్గేలా కనిపించలేదు. చివరికి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వివాదాస్పద చట్టాల్ని ఉపసంహరించుకుంది.