వెంకయ్యనాయడుకు ఘనసన్మానం, సీఎం, మాజీ సీఎం జోకులు: రూ. 50 లక్షలు!
మైసూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని సుత్తూరు వీరసింహాసన మహాసంస్థాన మఠంలో మంగళవారం డాక్టర్ శ్రీ శివరాత్రి రాజేంద్ర స్వామీజీ 103వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు హాజరు అయ్యారు. ఇదే వేదిక మీద సీఎం హెచ్.డి. కుమారస్వామి, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప జోకులు వేసుకుంటూ ఉల్లాసంగా కనిపించారు.
గురుకలంలోని నూతన భవనాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా సుత్తూరు మఠం పీఠాధిపతి శ్రీ శివరాత్రి దేశీకేంద్ర స్వామీజీ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తదితరులు వెంకయ్యనాయుడును కర్ణాటక సాంప్రధాయం ప్రకారం ఘనంగా సన్మానించారు.
ఇదే సందర్బంలో కొడుగు జిల్లాలో భారీ వరదల కారణంగా నిరాశ్రులు అయిన వారిని ఆదుకోవడానికి సూత్తూరు మఠం నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల చెక్కును శ్రీ శివరాత్రి దేశీకేంద్ర స్వామీజీ సీఎం కుమారస్వామికి అందించారు.
కేరళ వరద బాధితులకు సుత్తూరు మఠం తరపున రూ. 10 లక్షలు విరాళం అందించారు. ఈ సందర్బంగా శ్రీ శివరాత్రి దేశీకేంద్ర స్వామీజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జేఎస్ఎస్ సంస్థల తరపున శ్రీ శివరాత్రి రాజేంద్ర స్వామీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.
కొడుగులో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ సంవత్సరం సార్వసాధారణంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ ఖర్చు అయ్యే డబ్బు వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి ఇచ్చామని శ్రీ శివరాత్రి దేశీకేంద్ర స్వామీజీ అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వేదిక మీదకు వచ్చే సమయానికి మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప వేదిక మీద ఉన్నారు. కుమారస్వామిని ఆహ్వానించిన బీఎస్. యడ్యూరప్ప ఆయన్ను తన కుర్చి పక్కనే కుర్చోబెట్టుకున్నారు.
సీఎం కుమారస్వామి, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప రాజకీయ వ్యవహారాలు పక్కన పెట్టి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ జోకులు వేసుకుని ఉల్లాంసంగా కనిపించారు. రాజకీయాల్లో ఎవ్వరూ శాస్వత శత్రువులు ఉండరని కుమారస్వామి, బీఎస్ యడ్యూరప్ప నిరూపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జీటీ. దేవేగౌడ, సారా. మహేష్, సీఎస్. పుట్టరాజు, పుట్టరంగేశెట్టి, ఎమ్మెల్యేలు హెచ్. విశ్వనాథ్, యతీంద్ర సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు.