43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే
మణిపూర్లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. బంగారం అక్రమ రవాణా బయటపడింది. కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో మొత్తం 260 బంగారం బిస్కెట్లను గుర్తించారు. వాటిని కారు నుంచి వెలికి తీసేందుకు చాలా సమయం పట్టింది. 18 గంటల సమయం పట్టడంతో.. అందులో బంగారం ఉందా లేదా అనే అనుమానం కలిగింది. ఇదే వాహనాన్ని గతంలో స్మగ్లింగ్కి కూడా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.
మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్లో బంగారం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో 67 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 55 కిలోల బంగారం ఒక్క జూన్ నెలలోనే పట్టుబడడం విశేషం. ఆ క్రమంలోనే ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. అంతర్జాతీయ సరిహద్దు ఉండటం.. కొందరు అక్రమార్కులు బంగారం స్మగ్లింగ్ను ఆసరాగా చేసుకున్నారు.
దీంతో యధేచ్చగా స్మగ్లింగ్ జరుగుతుంది. భారీగా బంగారం తరలిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం గుండా కూడా భారీగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. రోజు ఎంతో కొంత బంగారం అక్కడ పట్టుబడుతుంది. కానీ మణిపూర్లో మాత్రం పెద్ద ఎత్తున బంగారం పట్టుబట్టడం కలకలం రేపుతోంది.