'మాజీ సీఎం.. ఆ నలుగురు నన్ను లైంగికంగా వాడుకున్నారు'
కోయంబత్తూరు : కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ ప్యానల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సరితా నాయర్, చీటింగ్ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం మంగళవారం నాడు కోయంబత్తూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మాజీ సీఎం ఉమెన్ చాందీ సహా మరో ముగ్గురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
కోర్టుకు హాజరైన సమయంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం ఉమెన్ చాందీతో సహా ఓ మంత్రి, మరో ముగ్గురు వ్యక్తులు తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపించారు సరితా నాయర్. కేరళ మాజీ ఆర్థిక మంత్రి పళని మాణిక్యం.. ఓ ఐటీ కేసు విషయంలో కోటి రూపాయలు లంచం డిమాండ్ చేశారని, అందుకు అడ్వాన్స్ గా తాను రూ.25 లక్షలు చెల్లించానని సరితా నాయర్ ఆరోపించారు.
అయితే లంచం తీసుకున్న తర్వాత సదరు మంత్రి తనను లైంగికంగా కూడా వేధించాడని, ఇదే క్రమంలో మాజీ సీఎం ఉమెన్ చాందీతో పాటు, సదరు మంత్రి సహా మరో ముగ్గురు తనను లైంగిక దోపిడీ చేశారన్నారు సరితా నాయర్. లైంగికంగా వేధించడమే గాక తనతో ఆర్థిక నేరాలు కూడా చేయించారని ఈ సందర్బంగా ఆమె వివరించారు.
సుమారుగా రూ.70కోట్ల సోలార్ కుంభకోణంతో ముడిపడి ఉన్న 13 మంది రాజకీయ నాయకులపై ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు సరితా నాయర్. అలాగే త్వరలోనే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆటో బయోగ్రఫీ రాయబోతున్నానని, దీనిపై మలయాళం, తమిళంలో సినిమాలు కూడా తీయబోతున్నానని తెలియజేశారు.