మమతా రావత్: మృత్యు కౌగిలి నుంచి వందల మందిని రక్షించిన ధీరవనిత!
ఉత్తరకాశీ పరిసరాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను చాలామందిని ఆమె సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
2013, ఉత్తరాఖండ్ వరదలు.. సునామీ ఘటన తర్వాత మళ్లీ అంతటి పెనువిషాదాన్ని నింపిన సంఘటన. చార్ధామ్ యాత్రికుల పాలిట మృత్యు పాశమైన తరిమిన ఆ ఘటన ఉత్తరాఖండ్ను కకావికలం చేసింది. ఫలితంగా దాదాపు 5700మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
విరిగిపడుతున్న కొండచరియలు, ముంచెత్తుతున్న వరదలు.. చార్ ధామ్ యాత్రికులకు బతుకుపై ఆశలు సన్నగిల్లేలా చేశాయి. అయినవాళ్లు కళ్లెదుటే వరదల్లో కొట్టుకుపోతున్నా.. ఏమి చేయలేని నిస్సహాయత. బయటి ప్రంపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయి.. తినడానికి తిండి లేక, ఆఖరికి ఒంటిపై బట్ట లేక.. అత్యంత దుర్భరమైన స్థితిలో కొన్ని వేలమంది విలవిల్లాడిపోయారు.
వీపుల మీద మోసుకుంటూ మరీ:
ఉత్తరాఖండ్ లోని దాదాపు 4200గ్రామాలు వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమతా రావత్(24) అనే పర్వతారోహకురాలు చూపించిన తెగువ కొద్దిమందినైనా ప్రాణాలతో బయటపడేలా చేసింది. ఉత్తరకాశీ పరిసరాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను చాలామందిని ఆమె సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉత్తరకాశీ-డెహ్రాడూన్ రహదారి తెరిచిన వెంటనే వాళ్లందరినీ వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.
తర్వాత తాను శిక్షణ పొందిన నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ టీమ్ తో కలిసి బాధితుల ప్రాణాలు రక్షించడానికి బయలుదేరింది. వరదల్లో చిక్కుకుపోయిన వందలామంది యాత్రికులు, అక్కడి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నడవలేని స్థితిలో ఉన్న ఎంతో మంది వృద్ధులను వీపు మీద మోసుకుంటూ మరీ వారి ప్రాణాలను నిలిపింది.
ఇంత చేసి..
ఇంత చేసి కూడా.. ఇందులో గొప్పతనమేమి లేదని అత్యంత సాదాసీదాగా సమాధానం చెబుతారు రావత్. 'నాకు కొండలెక్కడం తెలుసు.. ఎక్కడిక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయినవారు ఇక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వారు ముందుకురాకపోతే ఇంకెవరు ధైర్యం చేస్తారు?' అంటూ బదులిస్తారామె.
ఆమె ఓ స్కూల్ డ్రాపౌట్
మమతా రావత్ ఓ స్కూల్ డ్రాపౌట్. ఆరుగురు కుటుంబ సభ్యులున్న కటుంబాన్ని ఆమె ఒక్కరే నెట్టుకొస్తున్నారు. గట్టిగా కష్టపడితే మహా అయితే ఆమెకు నెలకు దక్కేది కేవలం రూ.10వేలు మాత్రమే. ఉత్తరాఖండ్ లాంటి కొండలు, గుట్టలతో నిండిపోయిన ప్రాంతాల్లో కంపెనీలు, ఉద్యోగాలు కష్టం. ఇక్కడ ఎక్కువ మంది టూరిజం మీద ఆధారపడే బతకుతుంటారు. 2013వరదల పుణ్యమాని అక్కడివారికి ఆ ఆదాయం కూడా లేకుండా పోయింది. వరదల భయంతో అక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఎంతోమందికి శిక్షణ ఇస్తూ:
ప్రస్తుతం తనలాంటి ఎంతోమందికి ఆమె ట్రెక్కింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఆమె శిక్షణ కారణంగా.. చాలామంది టూరిస్టు గైడ్స్ గా ఉద్యోగాలు పొందుతున్నారు. అలా అక్కడివారి జీవితాల్లో మమతా వెలుగులు నింపుతున్నారు. ఏ స్వార్థమూ ఆశించకుండా ఎంతోమంది ప్రాణాలను నిలిపిన ఆమె.. తనలో తెగువ ఉన్నంతవరకు ఎంతటి ధైర్య సాహసాలను ప్రదర్శించడానికైనా సిద్దమే అంటున్నారు. ఇంతటి గొప్ప మనిషికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఎలా ఉండగలం.