షాక్: సాధారణ గృహిణి.. రూ.కోట్ల రాకెట్ నిర్వహిస్తోంది
జైపూర్: సుష్మిత అనే మహిళ చూడటానికి సాధారణ గృహిణిలా కనిపిస్తుంది. కానీ విలాసవంతమైన భవంతిలో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతుంటుంది. ఆమెది సంపన్న కుటుంబం కాదు. ఆమె భర్త సాధారణ డ్రైవర్. కానీ ఆమె రాజస్థాన్లో అతిపెద్ద నల్లమందు రాకెట్ నడుపుతోంది.
పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తర్వాత షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఓపియం మాదకద్రవ్యాల (నల్లమందు) రాకెట్ను వెనక నుంచి నడిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు ఓపియం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని పోలీసులు విచారించగా.. జోధ్పూర్కి చెందిన సుమితా అనే మహిళ ఓ పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్నే నడుపుతోందని తేలింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి నిందితులు చెప్పిన చోటికి వెళ్లారు. బొరానాడా ప్రాంతంలోని నాలుగంతస్తుల బిల్డింగులో ఆమె ఉంటోంది. అక్కడ తనిఖీలు చేశారు.
తనిఖీల్లో 76 గ్రాముల ఓపియం, సిస్టమేటిక్ జీపీఎస్ మానిటరింగ్ సిస్టమ్, ఖరీదైన కార్లు కనిపించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. సుమిత ఆరేళ్ల క్రితం డ్రైవర్ అయిన తన భర్తతో కలిసి జోధ్పూర్కి వచ్చింది. భర్తకు కర్ణాటకలో డ్రైవర్గా మంచి ఉపాధి దొరకడంతో అతను వెళ్లిపోయాడు.
ఈ సమయంలో సుమితకు రాజురామ్ ఇక్రాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు మద్యం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతను సుమితను మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్లో దించాడు. 2015లో రాజురామ్ ఓపియం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. దాంతో అతని స్థానాన్ని సుమిత భర్తీ చేసింది.
రాజురామ్ దందాను ఏడాది పాటు గమనించిన సుమితకు స్మగ్లింగ్ ఎలా చేయాలో బాగా తెలిసింది. దాంతో నల్లమందు ఎక్కువగా పండే మధ్యప్రదేశ్, చిట్టోరాగడ్ ప్రాంతాల నుంచి కొన్ని రూ.కోట్ల ఖరీదైన ఓపియంను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేసేది. ఖరీదైన కార్లలో ఓపియం తరలిస్తూ కార్లు ఎక్కడికి వెళ్తున్న విషయాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించేది. ఈ వ్యాపారంలోకి కుటుంబ సభ్యులను కూడా దించింది. పోలీసులు సుమితతో పాటు మరో నలుగుర్ని అరెస్టు చేశారు.