కారు బాంబు దాడులు: 37 మంది బలి
అంకారా: టర్కీ రాజధానిలో నిత్యం రద్దిగా ఉండే ప్రాంతంలో కారులో వెళ్లిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 34 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. దాదాపు 125 మందికి పైగా తీవ్రగాయాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని టర్కీ అధికారులు చెప్పారు.
టర్కీ రాజధాని అంకారాలోని కిజిలే స్కేర్ సమీపంలో కి బాంబులు, మందు పాతరలు నింపుకుని కారులో వెళ్లిన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో అతని తో పాటు 34 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ప్రాణభయంతో ప్రజలు చెల్లాచెదురుగా పరుగు తీశారు.
వాణిజ్య భవనాలు, ట్రాన్స్ పోర్ట్ హబ్ లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చాల నష్టం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. అదే విధంగా సోమవారం సాయంత్రం మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్రగాయాలైనాయి.
గత ఐదు నెలల నుంచి ఉగ్రవాదులు టర్కీ పార్లమెంట్ భవనం, విదేశీ కార్యాలయాలు లక్షంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులు అని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని, రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.