‘ట్రంప్’ ఆంక్షల గోడతో అమెరికాకే ఇబ్బందులు.. క్యాడ్ భారీగా నమోదయ్యే చాన్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన దేశం చుట్టూ ఒక 'అదృశ్య గోడ'ను నిర్మించారని, ఫలితంగా నిపుణులైన విదేశీ ఉద్యోగుల నియామకంలో కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిభ ఆధారిత వలస చట్టం ఉండాలని ట్రంప్ అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదని వలస అంశాల్లో నిపుణులైన అమెరికా న్యాయవాదులు వెలువరించిన ఒక నివేదిక పేర్కొంది.ట్రంప్ వలస విధానం వల్ల విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాల కోసం ఆసక్తి చూపడం తగ్గిపోయింది. బీ 'అత్యంత నైపుణ్యం' ఉన్న హెచ్-1బీ వీసాల కోసం అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగానికి అందిన దరఖాస్తుల సంఖ్య.. ఐదేళ్లలో తొలిసారిగా పడిపోయింది.
ఒబామా హయాంలో నిబంధనల రద్దు.. అడుగడుగునా భిన్న నిర్ణయాలు
‘బీ' నైపుణ్య కార్మికులు, మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు, ఇతరుల కోసం ఉద్దేశించిన వలసేతర దరఖాస్తులపై అధికారులు కనీవినీ ఎరుగని స్థాయిలో పరిశీలిస్తున్నారు. బీ ‘హెచ్-1బీ' వీసా దరఖాస్తుల పరిశీలనలో అదనపు ఆధారాలు అడగడం, ఇంటర్వ్యూలు, అధునాతన పరిశోధనల్లో నిమగ్నమైన వలసదారుల్లో వ్యాపారాపేక్షను ప్రోత్సహించేందుకు ఒబామా తెచ్చిన నిబంధనలను రద్దు చేయడం, అత్యంత నిపుణులైన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఇచ్చే పని అనుమతిని రద్దుచేయడం వంటివి వలసదారులకు, కంపెనీలకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. బీ యాజమాన్య ప్రాయోజిత వీసాలకు సంబంధించిన కొత్త విధానాల వల్ల వ్యాపారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సరైన నైపుణ్యం ఉన్న విదేశీ కార్మికులను నియమించుకోవడానికి గణనీయస్థాయిలో డబ్బు, సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
త్వరలో వాణిజ్య ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కత్తి దూస్తున్నారు. చైనా వాణిజ్య ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా వాణిజ్య ఆంక్షలు విధించే ఆస్కారం ఉన్నట్టు అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రకటించింది. బీజింగ్ మేధోసంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన కట్టుబాట్లను ఉల్లంఘించిందనేందుకు బలమైన సాక్ష్యాలున్నట్టు అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రకటించారు. ఇందుకు ప్రతిగా యుఎస్టిఆర్ 301 కింద ట్రంప్ చైనాపై వాణిజ్య ఆంక్షలు ప్రకటించనున్నట్టు వైట్హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ రాజ్ షా తెలిపారు. అంతకు మించిన వివరాలు ప్రకటించడానికి అధికారులు నిరాకరించారు.
ఉత్తరకొరియాతో కొరివి చల్లారకుండానే చైనాపై ఆంక్షలతో వణుకే
తాము కోరిన వివరణలకు చైనా నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని అమెరికా అధికారి ఒకరన్నారు. మార్కెట్ అనుకూల విధానాలు అనుసరిస్తామన్న హామీలను చైనా ఎంతవరకు ఆచరిస్తుందన్న అంశంపై ఎన్నో సందిగ్ధతలున్నట్టు పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఒకపక్క ఉత్తర కొరియాతో వాణిజ్య యుద్ధం సెగలు ఇంకా చల్లారకుండానే ఇప్పుడు ట్రంప్ చైనాపై కత్తి దూయడం ప్రపంచ మార్కెట్లను వణికిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
జీడీపీలో రెండు శాతానికి చేరనున్న ‘క్యాడ్'
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత కరెంట్ ఎకౌంట్ లోటు (సీఏడీ) మూడు రెట్లు పెరిగి 10-12 బిలియన్ డాలర్లకు చేరొచ్చని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అధిక వాణిజ్య లోటుతో ఈ పరిస్థితి చోటు చేసుకోనున్నదని పేర్కొంది. జీడీపీలో సీఏడీ 13.5 బిలియన్ డాలర్లతో రెండు శాతానికి చేరనుందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీలో సీఏడీ 8 బిలియన్ డాలర్లతో 1.4 శాతంగా ఉంది. 2017-18లో మొత్తంగా సీఏడీ 46 - 48 బిలియన్ డాలర్లకు పెరుగనున్నది. ఇది జీడీపీలో 1.8 శాతంగా ఉండనున్నది. 2016-17లో 15.2 బిలియన్లతో 0.7 శాతం. 2018-19లో భారత ఎగుమతులు 335-340 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో దిగుమతులు 505-510 బిలియన్లుగా ఉంది. దీంతో భారత వాణిజ్య లోటు 170-175 బిలియన్ డాలర్లకు చేరనుందని తెలుస్తోంది. 2018-19లో 45-50 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదు కావొచ్చు. 2018లో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 64-66గా ఉండొచ్చు.