Covid-19 : ప్రమాద ఘంటికలు.. ప్రపంచానికి ముప్పు పెరిగిందన్న డబ్ల్యూహెచ్ఓ
కరోనా వైరస్ ప్రభావం, దాని వ్యాప్తి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. ప్రమాద ఘంటికలు తీవ్రంగా ఉన్నాయని.. అయితే ఇప్పటికీ నియంత్రణ సాధ్యమేనని వెల్లడించింది. కరోనా వైరస్తో పొంచి ఉన్న ముప్పు అంచనాలను పెంచుతున్నట్టు తెలిపింది. పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీ విషయంలో పెద్ద తప్పిదం జరిగిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ తెలిపారు.
Recommended Video
గడిచిన కొద్దిరోజుల్లో ఇటలీ నుంచి 14 దేశాలకు 24 కరోనా కేసులు వ్యాప్తి చెందాయని.. అలాగే ఇరాన్ నుంచి 11 దేశాలకు 97 కేసులు వ్యాప్తి చెందాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రమాద తీవ్రత అంచనాలను పెంచినట్టు తెలిపారు. కరోనా పరిణామాలను ఎపిడిమాలజిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారని చెప్పారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతోందా.. లేక సమూహాల నుంచి వ్యాప్తి చెందుతోందా అన్న విషయాన్ని ఇప్పటికీ కనిపెట్టలేదన్నారు. కరోనా వైరస్ స్వేచ్చగా వ్యాప్తి చెందుతోందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్లే దాన్ని మహమ్మారిగా ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం మన ముందున్న అతిపెద్ద శత్రువు వైరస్ కాదని.. భయం,ఆందోళన,వదంతులు అని చెప్పారు.
డెన్మార్క్,ఎస్టోనియా,లిథునియా,నెదర్లాండ్ దేశాలల్లో గురువారం మొదటి కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈ కేసులన్నీ ఇటలీతో సంబంధం ఉన్నవే అని చెప్పారు. సరైన జాగ్రత్తలతో కరోనా వైరస్ను నియంత్రించవచ్చునని.. ఆయా దేశాలు సరైన ఐసోలేషన్ను కలిగి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని చెప్పారు. ఇక ఇరాన్లో డబ్ల్యూహెచ్ఓ మిషన్ ఆలస్యమవుతోందని.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. ఇరాన్ వెళ్లేందుకు విమానాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అయితే ఇరాన్కు ప్రస్తుతం యూఏఈ సహాయం అందిస్తోందన్నారు. ఆదివారం లేదా సోమవారం తాము ఇరాన్ చేరుకుంటామని చెప్పారు. కాగా,కరోనా వైరస్ కారణంగా శుక్రవారం ఒక్కరోజే చైనాలో 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2788కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ ఇప్పటివరకు 2800 మృతి చెందగా 83వేల మందికి వైరస్ సోకింది.