చైనాకు షాక్: భారత్కు ఎస్టీఏ-1 హోదా ఇచ్చిన అమెరికా, ఇక నాటోతో సమానమే!
Recommended Video
వాషింగ్టన్: భారత్కు మరోసారి అమెరికా తన స్నేహ హస్తాన్ని అందించింది. భారత్కు వ్యూహాత్మక వాణిజ్య అధికారం(ఎస్టీయే-1) కల్పిస్తున్నట్లు ఇటీవల అమెరికా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇందుకు సంబంధించి అధికారిక ఫెడరల్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏకైక దక్షిణాసియా దేశం
ఈ నేపథ్యంలో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తుల విక్రయాలపై అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు అందుతాయో భారత్కు కూడా ఆ సదుపాయాలు వర్తిస్తాయి. ఈ హోదా అందుకున్న ఆసియా దేశాల్లో భారత్ మూడోది కాగా, ఎస్టీయే-1 హోదా కలిగిన ఏకైన దక్షిణాసియా దేశం భారత్ కావడం గమనార్హం.
వాటిలో సభ్యత్వం లేకున్నా..
సాధారణంగా అత్యంత శక్తిమంతమైన నాలుగు బృందాల కూటమి(అణు ఇంధన సరఫరాదారుల కూటమి, ఆస్ట్రేలియా కూటమి, వాసెనార్ ఒప్పందం, క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ)లో తప్పనిసరిగా సభ్యత్వం ఉన్న దేశాలకు మాత్రమే అమెరికా ఎస్టీయే-1 హోదా ఇస్తోంది. అయితే వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్జీ)లో తప్ప మిగిలిన మూడింటిలో భారత్కు సభ్యత్వం ఉంది. అయినప్పటికీ భారత్కు మినహాయింపు కల్పిస్తూ అమెరికా ఈ హోదాను ఇచ్చింది. ఈ మేరకు అమెరికా తన ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.
చైనాకు గట్టి ఎదురుదెబ్బే..
అయితే, భారత్కు ఎస్టీయే-1 హోదా రావడంతో పొరుగుదేశమైన చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎందుకంటే ఎన్ఎస్జీ కూటమిలో భారత్ ప్రవేశానికి చైనా అడ్డుచెబుతూ వస్తోంది. దీని వల్ల భారత్కు సభ్యత్వం రావడం లేదు. దీంతో పాటు భారత్-అమెరికా రక్షణ ఒప్పందాలపై ముఖ్యంగా సాంకేతిక బదలాయింపుపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్కు హోదా రావడం చైనాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
నాటో దేశాలతో సమానంగా భారత్..
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కల్పించిన ఎస్టీయే-1 హోదా కలిగిన దేశాల జాబితాలో భారత్ 37వ దేశం. ఈ జాబితాలో ఇప్పటికే జపాన్, దక్షిణకొరియా దేశాలు ఉండగా.. భారత్ మూడో ఆసియా దేశం. ఈ హోదాతో భారత్.. అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. అంతేగాక, నాటో దేశాలతో సమానంగా భారత్కు హోదా లభించినట్లయింది. గత కొంత కాలంగా చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా.. భారత్కు ఎస్టీఏ-1హోదా ఇవ్వడంతో చైనాకు షాక్ తగిలినట్లయింది.