ఇండియన్స్ స్మార్ట్, వారుండాలి: ట్రంప్, ఒబామా జోస్యం
వాషింగ్టన్: ఆమెరికాలో విదేశీయుల ఉద్యోగాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత విద్యార్థుల పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులు ఉండాలని, ఎందుకంటే వారు స్మార్ట్ అని, అలాంటి వారు ఉండాలన్నారు.
అమెరికన్ విద్యాలయాల్లో చదివేందుకు వచ్చే భారత విద్యార్థులను వెనక్కి పంపరాదని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. భారత విద్యార్థులు స్మార్ట్ అని చెప్పారు. అమెరికాకు వారి అవసరం ఎంతైనా ఉందన్నారు. మనకు నచ్చినా, నచ్చకున్నా వారు డబ్బు చెల్లించి వస్తున్నారన్నారు.
వారు తెలివైన వారని, వారికి మనం విద్యను అందిస్తున్నామని, అలాంటి వారు మన దేశంలో ఉండాలని, వారిని వెనక్కు పంపితే మనకే నష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. వారిని ఇక్కడకు రానివ్వకుంటే.. హార్వార్డ్కు వెళ్తారని అభిప్రాయపడ్డారు.
విద్యలో రాణించిన వారు తిరిగి భారత్కు వెళ్తే, అక్కడ కంపెనీలు పెడతారన్నారు. మరింత మందికి ఉద్యోగాలను కల్పిస్తారన్నారు. కొంతమంది ఇక్కడే ఉండాలని అనుకుంటారని, అలా చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉన్న వారిని వెళ్లగొట్టడం సరికాదన్నారు.
ట్రంప్ పైన ఒబామా జోస్యం
అమెరికన్ అధ్యక్ష పదవి రిపబ్లికన్ నేతకు దక్కకదని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా అభిప్రాయపడుతున్నారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్ట్ ట్రంప్ విజయం సాధించలేకపోవచ్చని ఒబామా భావిస్తున్నట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రపంచ స్పందనను ప్రతి అమెరికన్ పౌరుడూ నిశితంగా పరిశీలిస్తున్నారని ఒబామా పేర్కొన్నారు. ఆయన గెలిచే అవకాశాలు లేవని ఒబామా చెప్పినట్లు వైట్ హౌస్ పేర్కొంది. అమెరికన్లు ఒబామాను నమ్మడం లేదని ఆయన చెప్పారు. సహనం, నేర్పు ఉన్న వ్యక్తినే అమెరికన్లు అధ్యక్ష పీఠానికి ఎంపిక చేస్తారనుకుంటున్నట్లు చెప్పారు.