మన ఐటీకి ఉజ్వల భవిష్యత్తు, ఆయన బిజినెస్ ఫ్రెండ్లీ: ట్రంప్ ను ఆకాశానికెత్తేసిన సిక్కా
ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ పాలనలో భారతీయ ఐటీ కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముంబై: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ పాలనలో భారతీయ ఐటీ కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భారత ఐటీ కంపెనీలకు అక్కడ ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ భరోసా ఇచ్చారు. వినూత్న పథకాలతో అమెరికాలోని కొత్త ప్రభుత్వం అద్భుత అవకాశాలను సృష్టిస్తోందన్నారు.
బిజినెస్ ఫ్రెండ్లీ, పారిశ్రామికవేత్త ట్రంప్ ఆధ్వర్యంలో అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయని విశాల్ సిక్కా చెప్పారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు.
ఐటి సంక్షోభంలో పడిందన్న నివేదికలను ఆయన తిరస్కరించారు. మరిన్ని అవకాశాలు రానున్నాయని ఒక ఇంటర్వ్యూలో పీటీఐకి చెప్పారు. ట్రంప్ పరిపాలన లో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పీటీఐ ప్రశ్నించగా.. తాను ఆ విధంగా భావించడం లేదని సిక్కా చెప్పారు.
నూతన ఆవిష్కరణలపై దృష్టి కొనసాగినంత వరకూ, నూతన రంగాల్లో విలువైన సేవలు అందించినంత వరకు ఇది పెద్ద సమస్య కాదని తాను భావిస్తున్నాన్నారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలపై పట్టుసాధిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికాలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ లో తన మూడు సంవత్సరాల అనుభవంలో భారతీయ యువత ఈ మార్పుకోసం సిద్ధంగా ఉందనే విశ్వాసాన్ని విశాల్ సిక్కా వ్యక్తం చేశారు. గత మూడున్నర దశాబ్దాల్లో భారతీయ ఐటి కంపెనీలు అసాధారణ పురోగతి సాధించాయని ఆయన వ్యాఖ్యానించారు.