కుప్పం అన్న క్యాంటీన్ మళ్లీ కూల్చివేత-అర్ధరాత్రి సమయంలో- వారంలో రెండోసారి-లోకేష్ ఫైర్
కుప్పం : టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విధ్వంసకాండ కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబు రాక సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు కూల్చేశాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జగన్, పెద్దిరెడ్డిని అక్కడికి రావాలని సవాళ్లు విసిరారు. అయితే చంద్రబాబు టూర్ తర్వాత నిన్న లోకేష్ కుప్పానికి వచ్చారు. దీంతో ఇదే అన్న క్యాంటీన్ ను మరోసారి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు.
Recommended Video
కుప్పం అన్న క్యాంటీన్ కూల్చివేత
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో గాయపడిన టీడీపీ నేతల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్సీ నారా లోకేష్ నిన్న అక్కడికి వెళ్లారు. లోకేష్ పర్యటన కొనసాగుతుండగానే కుప్పంలో అన్న క్యాంటీన్ ను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. అర్థరాత్రి అన్నక్యాంటీన్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫ్లెక్సీలు, తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్ దగ్గరకు చేరుకుంటున్నారు.
వారం రోజుల్లో రెండోసారి
కుప్పంలో గత వారం చంద్రబాబు పర్యటించి వెళ్లారు. అప్పుడు చంద్రబాబు రాక సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో కుప్పంలో టీడీపీ నేత రవిచంద్ర ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు కూల్చివేశాయి. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైసీపీ శ్రేణుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఈ క్యాంటీన్ ను సరిచేసి అక్కడే జనానికి భోజనం పెట్టారు. ఇప్పుడు లోకేష్ కుప్పం రాగానే మరోసారి అన్న క్యాంటీన్ పై దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది.
కూల్చివేతపై లోకేష్ ఆగ్రహం
కుప్పంలో అర్దరాత్రి అన్నక్యాంటీన్ ధ్వంసం చేయడంపై నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లపై దాడులు సీఎం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందన్నారు. అలాంటిది అర్థరాత్రి వైసీపీ దీన్ని ధ్వంసం చేయడాన్ని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని, ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామన్నారు. ఇప్పటికైనా అన్నక్యాంటీన్పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.